భారత్లో తిరుగుతున్న కార్ల భద్రతా ప్రమాణాలపై ఇప్పటికే అనేక సందేహాలు, ప్రశ్నలు నెలకొనివున్నాయి. ముఖ్యంగా స్వదేశంలో తయారవుతున్న కార్లే కాకుండా, విదేశాల్లో తయారై భారత్కు దిగుమతి అవుతున్న కార్ల భద్రతా ప్రమాణాలు కూడా ప్రశ్నార్థకంగా ఉన్నట్టు తాజాగా వెల్లడైంది. భారత్ ఓ డంపింగ్ యార్డు.. ఇక్కడ సేఫ్టీ టెస్టులో విఫలమైన డొక్కు కార్లను భారత్కు తరలించేద్ధాం అనే అభిప్రాయం ప్రతి విదేశీ కార్ల ఉత్పత్తి కంపెనీ ప్రతినిధుల్లో నెలకొనివుంది.
ఇదే అంశంపై జాతీయ రోడ్డు భద్రతా సమాఖ్య సభ్యుడు కమల్ సోయ్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ కంపెనీలు భారతలో విక్రయించే కార్లలో భద్రతా ప్రమాణాల విషయంలో రాజీ పడుతున్నాయని, ఈ ధోరణి కొనసాగితే దేశంలో కార్ల ప్రమాదాలు తీవ్రస్థాయికి చేరతాయని హెచ్చరించారు. యూరప్, జపాన్, యుఎస్కు చెందిన కార్ల ఉత్పత్తి సంస్థలు భారతను డంపింగ్ యార్డులా భావిస్తున్నాయని నిప్పులు చెరిగారు. ఆయా దేశాల్లో పనికిరాని పాత కార్లను భారతలో విక్రయిస్తున్నారని మండిపడ్డారు.
బీఎండబ్ల్యూ 3 సీరిస్ గురించి ప్రస్తావిస్తూ.. ఈ కారుకు జరిగిన క్రాష్ టెస్టులో యావరేజ్ రేటింగ్ వచ్చిందని, ఈ మోడల్కు నిర్వహించిన టెస్టుల్లో 12 కార్లు రెండు ముక్కలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం ఉత్పత్తి నిలిపివేసిన మారుతీ 800 మోడల్లో సైతం భద్రతా ప్రమాణాలు అధ్వాన్నంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. జాతీయ క్రైమ్ రికార్డు బ్యూరో రికార్డుల ప్రకారం మారుతీ 800 కారణంగా 3 లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసాయని గుర్తు చేశారు.