ఏప్రిల్ ఒకటి నుంచే ఐటీ రిటర్నులు దాఖలు

గురువారం, 16 ఫిబ్రవరి 2023 (10:21 IST)
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి సంబంధించిన రిటర్నులను ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచే సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. 2023-24 మదింపు సంవత్సరం ప్రారంభం రోజు నుంచే సంబంధిత ఫారాలు అందుబాటులో ఉంటాయని బుధవారం తెలిపింది. 
 
గత ఏడాది ఐటీఆర్‌ పత్రాలతో పోలిస్తే ఈసారి పెద్దగా మార్పులేమీ లేనందున, పన్ను రిటర్నులు దాఖలు చేసేవారు సులభంగా ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చని పేర్కొంది. వ్యక్తులు, వృత్తి నిపుణులు, వ్యాపార సంస్థలు దాఖలు చేయాల్సిన 1-6 వరకు ఐటీఆర్‌ ఫారాలను సీబీడీటీ ఇప్పటికే నోటిఫై చేసింది. 
 
మదింపు సంవత్సరం (అసెస్‌మెంట్‌ ఇయర్‌) ప్రారంభం నుంచే రిటర్నులు దాఖలు చేయడం వల్ల, పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడింది. సాధారణంగా జులై 31 వరకు రిటర్నులు దాఖలు చేసేందుకు గడువు ఉంటుంది. అనివార్య సందర్భాల్లో సీబీడీటీ ఈ గడువును పొడిగిస్తూ వస్తున్న విషయం తెల్సిందే. దీంతో ఈ యేడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే ఈ అవకాశం కల్పించడంతో ఐటీ రిటర్నుల దాఖలు గబారా పడాల్సిన అవసరం ఉండదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు