పెద్ద నోట్ల రద్దుతో భారత ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతుందని, ప్రజల కొనుగోలు శక్తి నశించి పరిశ్రమలతో సహా వృద్ధి రేటు దారుణంగా పడిపోతుందని అంచనాలు ఉన్నప్పటికీ ప్రపంచ ఆర్థిక షాక్లు బారత్పై పెద్దగా పనిచేయటం లేదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ పేర్కొంది. అంతే కాదు భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థనుంచి ఎదురయ్యే షాక్ల ప్రభావం కూడా ఇతర దేశాలతో పోలిస్తే భారత్పై తక్కువగానే ప్రభావం చూపుతుందని ఐఎంఎప్ పేర్కొంది. దీనికి కారణం చాలా సింపుల్ అని తేల్చేసింది. భారత్ ప్రధానంగా దేశీ డిమాండ్ ఆదారిత ఆర్థిక వ్యవస్థ కాబట్టి ప్రపంచంలో ఎన్ని ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నా, అవి భారత్పై చూపే ప్రభావం తక్కువేనని వివరించింది.
భారత్ ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగైన స్థితిలో ఉందని ఐఎంఎఫ్ సీనియర్ అధికారి పాల్ కషిన్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి ఎదురయ్యే షాక్ల ప్రభావం ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్పై తక్కువగానే ఉంటుందని చెప్పారు. ‘ఇటీవలి కాలంలో పలు దేశాల్లో వృద్ధి మందగమనాన్ని చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి తీవ్రంగా దెబ్బతినడం, డిమాండ్ పడిపోవడం వంటివి జరిగితే భారత్పైనా ప్రభావం చూపుతుంది. అయితే, ఇతర వర్ధమాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే ఈ ప్రభావం స్వల్పమే’ అని ఆయన తెలిపారు.
ప్రధానంగా దేశీ డిమాండ్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అయిన భారత్లో డీమోనిటైజేషన్కు ముందు వినిమయం అత్యంత మెరుగైన స్థితిలో ఉండేదని ఆయన పేర్కొన్నారు. కాగా, గడచిన కొన్నేళ్లుగా భారత్ అనుసరిస్తున్న ద్రవ్యపరపతి విధానం, కార్యాచరణ భేషుగ్గా ఉందని కషిన్ చెప్పారు. ‘డీమోనిటైజేషన్ వల్ల వినిమయం దెబ్బతినడం వంటి స్వల్పకాలిక అడ్డంకులు తొలగిపోతే.. వృద్ధి మళ్లీ పట్టాలెక్కుతుంది. ప్రస్తుత 2016–17లో వృద్ధి రేటు 6.6%కి తగ్గొచ్చు. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోనూ ఈ ప్రభావం ఉంటుంది. అయితే, మధ్యకాలానికి మళ్లీ 8%పైగా వృద్ధి రేటు బాటలోని వచ్చేస్తుంది’ అని కషిన్ వివరించారు.