వచ్చే మూడేళ్లలో భారత్‌లో భారీగా పెరగనున్న కోటీశ్వరుల సంఖ్య

వరుణ్

ఆదివారం, 14 జనవరి 2024 (09:53 IST)
భారత్‌లో వచ్చే మూడేళ్ల కాలంలో కోటీశ్వరుల సంఖ్య భారీగా పెరుగనుంది. అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ అంచనా మేరకు... 2027 నాటికి భారతదేశంలో కోటీశ్వరుల సంఖ్య 10 కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. ప్రస్తుతం వీరి సంఖ్య 6 కోట్ల స్థాయిలో ఉందని, 2027 నాటికి 67 శాతం వృద్ధితో పది కోట్లకు చేరుకోవచ్చని తాజా నివేదికలో పేర్కొంది. కనీసం 10,000 డాలర్ల (రూ.8.3 లక్షల) వార్షికాదాయం కలిగిన వారిని ఈ జాబితాలో చేర్చింది. 
 
ప్రస్తుతం వేతన జీవుల్లో 4 శాతం మాత్రమే ఏటా 10,000 డాలర్లకు పైగా ఆదాయం ఆర్జిస్తున్నారని, దేశ తలసరి ఆదాయం 2,100 డాలర్ల (రూ.1.75 లక్షలు)కు దాదాపు ఐదు రెట్లు అధికమిదని రిపోర్టులో ప్రస్తావించింది. 2019-23 మధ్య కాలంలో ధనిక భారతీయులు ఏటేటా 12 శాతం చొప్పున పెరుగుతూ వచ్చారని, ఇదే కాలానికి దేశ జనాభా ఒక శాతం చొప్పున పెరిగిందని గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంటోంది. 
 
గత మూడేళ్లలో సంపన్న వర్గం వేగంగా వృద్ధి చెందడం ద్వారా దేశంలో ఈక్విటీలు, బంగారం, స్థిరాస్తి ఆర్థిక, భౌతిక ఆస్తులు కూడా గణనీయంగా పెరిగాయని నివేదిక పేర్కొంది. ప్రధానంగా ఈక్విటీ, బంగారం ఆస్తులు అధికంగా పెరిగాయని, గత 3-4 ఏళ్లలో స్థిరాస్తి ధరలు గరిష్ఠ వృద్ధిని నమోదు చేసుకున్నాయంటోంది. 2023లో డీమ్యాట్‌ ఖాతాలు 2.8 రెట్లు పెరిగి 11.4 కోట్లకు చేరుకున్నాయని, బీఎస్‌ఈ 200 లిస్టెడ్‌ కంపెనీల స్టాక్స్‌, మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు సైతం గణనీయంగా పెరిగాయంది.
 
2019-23 మధ్యకాలంలో భారతీయుల వద్దనున్న బంగారం విలువ 63 శాతం పెరిగి 1.8 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుందని రిపోర్టు తెలిపింది. ధనిక వర్గం పెరుగుదల పలు రంగాలపై సానుకూల ప్రభావం చూపిందని గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంటోంది. ఎఫ్‌ఎంసీజీ, పాదరక్షలు, ఫ్యాషన్‌ వస్త్రాలు, ప్యాసింజర్‌ వాహనాలు, ద్విచక్ర వాహన విభాగాల్లో ప్రీమియం ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. అధిక ఆదాయ వర్గాల వినియోగ అవసరాలపై దృష్టిసారించిన కంపెనీలు మెరుగైన పనితీరు కనబర్చాయి.
 
జ్యూవెలరీ, పర్యాటకం, ప్రీమియం రిటైల్‌, ప్రీమియం హెల్త్‌కేర్‌ సేవల వ్యాపారాలు భారీగా లాభపడ్డాయని రిపోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి క్రెడిట్‌ కార్డు హోల్డర్లు 80 శాతం పెరగగా.. కార్డుల ద్వారా వ్యయాలు 250 శాతం పెరిగాయని తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు