భారత్‌లో ఆర్థిక మాంద్యం తప్పదా... రఘురాం రాజన్ ఏమంటున్నారు?

ఆదివారం, 17 డిశెంబరు 2023 (09:35 IST)
భారత్‌లో ఆర్థిక మాంద్యంపై భారత రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ స్పందించారు. దేశ ఆర్థికాభివృద్ధి ప్రస్తుతం ఆరు శాతంగా ఉందని, మున్ముందు కూడా ఇదే కొనసాగితే భారత్ మధ్యాదాయ దేశంగా మిగిలిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
హైదరాబాద్‌‍లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, దేశ ఆర్థికాభివృద్ధి ప్రస్తుతం ఆరు శాతంగా పరిమితమైతే 2047లో కూడా భారత్ మధ్యాదాయ దేశంగా మిగిలిపోతుందన్నారు. అప్పటికి జనాభాలో వృద్ధుల శాతం కూడా పెరిగి ఆర్థిక వ్యవస్థపై మరింత భారం పడుతుందన్నారు. 
 
'ఆర్థికాభివృద్ధి ఏటా 6 శాతంగా ఉందనుకుందాం. అది ప్రతి 12 ఏళ్లకూ రెట్టింపు అవుతుందనుకుంటే 24 ఏళ్లల్లో తలసరి ఆదాయం నాలుగు రెట్లు పెరుగుతుంది. అంటే.. ఇప్పుడున్న 2,500 డాలర్ల తలసరి ఆదాయం 10 వేల డాలర్లకు పెరుగుతుంది. దీంతో, 2047కి కూడా మనం మధ్యాదాయ దేశంగానే మిగిలిపోతాం' అని ఆయన పేర్కొన్నారు.
 
2047 కల్లా దేశంలో వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతుందని రఘురామ్ రాజన్ హెచ్చరించారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు తగ్గిందని వెల్లడించారు. వేగంగా అభివృద్ధి సాధించకపోతే భారత్ సుసంపన్నం అయ్యే లోపే వృద్ధాప్యం మీద పడుతుందని, జనాభాలో పెరిగిన వృద్ధుల భారం ఆర్థికవ్యవస్థపై పడుతుందని హెచ్చరించారు. ప్రస్తుత ఆర్థికవృద్ధి రేటు ఉద్యోగాల కల్పనకు సరిపోదన్నారు. వృద్ధుల జనాభా పెరిగే లోపే భారత్ ను సంపన్న దేశంగా మార్చేందుకు ప్రస్తుత వృద్ధిరేటు సరిపోదని తేల్చి చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు