ప్రయాణికుల రైళ్ళ రాకపోకలపై ఆ తర్వాత నిర్ణయం.. రైల్వే శాఖ

శనివారం, 4 ఏప్రియల్ 2020 (10:51 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం దేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించింది. దీంతో దేశ వ్యాప్తంగా రైళ్ళ రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఈ లాక్‌డౌన్ సమయం ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత 15వ తేదీ తర్వాత రైళ్లు, విమాన రాకపోకలు యధావిధిగా పునఃప్రారంభమవుతాయనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వీటిపై రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. 
 
లాక్‌డౌన్ కారణంగా నిలిపివేసిన అన్ని రకాల ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్ళ రాకపోకల పునరుద్ధణపై ఈ నెల 12వ తేదీ తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అదేసమయంలో అడ్వాన్స్ రైల్వే టిక్కెట్స్ బుక్కింగ్ ప్రక్రియను ఎన్నడూ ఆపివేయాలని లేదని వివరణ ఇచ్చింది. అయితే, లాక్‌డౌన్ కాలానికి మాత్రం అన్ని రకాల రిజర్వేషన్లు నిలిపివేసినట్టు పేర్కొంది. 
 
అంతేకానీ, రైల్వే టికెట్ల బుకింగ్ ప్రక్రియ ఎప్పుడూ నిలిచిపోలేదని, 120 రోజుల ముందే టికెట్ల రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం ముందు నుంచే ఉందని తెలిపింది. కేవలం లాక్‌డౌన్ అమల్లో ఉన్న తేదీల్లో (మార్చి 24 నుంచి ఏప్రిల్ 14) జరిగే ప్రయాణాలకు మాత్రమే బుకింగ్స్‌ను రద్దు చేసినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. 
 
మూడు నెలల ముందు నుంచే బుకింగ్స్ చేసుకునే సౌకర్య ఉండటంతో వేసవి సెలవుల దృష్ట్యా ఇప్పటికే  భారీ సంఖ్యలో అడ్వాన్స్ రిజర్వేషన్లు జరిగాయి. దూర ప్రాంత రైళ్లలో రిజర్వేషన్లకు ఇప్పుడు ‘నో రూమ్‌’ అని వస్తోంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ పై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే తాము ఒక నిర్ణయానికి వస్తామని రైల్వే శాఖ తెలిపింది. డిమాండ్‌ను బట్టి ప్రత్యేక రైళ్లను నడిపే ఆలోచన చేస్తున్నట్టు అధికారులు చెప్పారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు