జీఎస్టీ తగ్గింపు... ధరలు తగ్గనున్న వస్తువులు ఇవే...

శుక్రవారం, 19 జనవరి 2018 (15:01 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన గురువారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైంది. ఇందులో కొత్తగా 29 వస్తువులు, 54 సేవలపై ప్రస్తుతం ఉన్న పన్నును తగ్గించారు. జీఎస్టీ మండలి ఆదేశాల ప్రకారం మారిన ధరలు ఈ నెల 25 నుంచి అమలులోకి వస్తాయి. పాత వాహనాల విభాగంలో మధ్య, పెద్ద తరహా కార్లు, ఎస్యూవీలను విక్రయించే వ్యాపారులు లాభాలపై పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. ఈ తగ్గింపు వల్ల ప్రభుత్వ ఆదాయానికి రూ.వెయ్యి నుంచి రూ.1200 కోట్ల మేరకు గండిపడనుంది. 
 
అలాగే, పిల్లల చిరుతిళ్లలో భాగమైన మిఠాయిలు (షుగర్ బాయిల్డ్ కన్ఫెక్షనరీ)లపై, 20 లీటర్ల వాటర్ క్యాన్‌లపై, ఎరువుల్లో ఉపయోగించే ఫాస్పారిక్ యాసిడ్‌పై, జీవ ఇంధనం, జీవ ఎరువులు, వేపపూత ఉన్న ఎరువులు, నిమ్మగడ్డి, వెదురుతో చేసే భవన నిర్మాణ సామాగ్రి, బిందుసేద్యం పరికరాలు, మెకానికల్ స్ప్రేయర్లపై జీఎస్టీని 18 నుంచి 12 శాతానికి తగ్గించారు. 
 
ఇకపోతే, చింతపండు గింజల పొడి, మహిళలకు ప్రీతిపాత్రమైన కోన్ గోరింటాకు, ఇళ్లకు వంటగ్యాస్ సరఫరా చేసే ఎల్పీజీ, శాస్త్ర సాంకేతిక పరికరాలు, ఉపగ్రహాల్లో వాడే సామాగ్రి తదితరాలపై ప్రస్తుతమున్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. ఇక గడ్డి, కేన్ వంటి సామాగ్రితో తయారు చేసే పరికరాలు, వెల్‌వెట్ వస్త్రాలపై 12 శాతం పన్నును 5 శాతానికి తీసుకు వచ్చింది. వజ్రాలు, ఇతర విలువైన రాళ్లపై 3 శాతం ఉన్న పన్నును 0.25 శాతానికి తగ్గించింది. విభూది, వినికిడి పరికరాల విడిభాగాలు, నూనె తీసిన వరిధాన్యం తవుడుపై పన్నును పూర్తిగా తొలగించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు