మీకు నడపటం చేతకాక మాంసాహారం బంద్ చేస్తారా మహరాజా

మంగళవారం, 11 జులై 2017 (02:30 IST)
ఉరుము ఉరిమి మంగలం మీద పడిందంటే ఇదేమరి. ఎయిరిండియా మహారాజావారికి మహా కోపం వచ్చేసింది. ఎన్ని సర్వీసులు నడిపినా, ఎన్ని పొదుపు చర్యలు పాటించినా, ఖర్చులను ఎంత కంట్రోల్ చేసినా సంస్థ అప్పులు కొండవీటి చాంతాడులా పెరిగిపోతున్నాయే బతికి బట్టకట్టాలంటే ఏం చేయాలి అని మథనపడి మథనపడి చివరకు ఒక కఠోర నిర్ణయం తీసుకున్నారు. తక్కువ ధరల టిక్కెట్లతో ప్రయాణించే ప్యాసింజర్లకు మాంసాహారం కట్ చేశారు. అంతపెద్ద మహాజారావారికి తక్కువ క్లాసు వారిమీదే చూపు పడింది. గంగమ్మకు పోతరాజులాగా అన్నమాట. ఇంకేం ఇక నుంచి మీరు మా విమానాల్లో ప్రయాణించేటప్పుడు మీకు మాంసం వడ్డంచం పోండని చెప్పి చేతులు దులుపుకుంది. అది కూడా దేశీయ విమానాల్లోనే అట. ఎయిరిండియా తన అప్పుల భారం తగ్గించుకునేందుకు ఎన్నుకున్న పరిష్కారం ఇదన్నమాట.
 
దేశీయ విమానాల్లోని ఎకానమీ క్లాస్‌ ప్రయాణికులకు మాంసాహారం వడ్డించబోమని ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా పేర్కొంది. ఇకపై కేవలం శాకాహారం మాత్రమే అందిస్తామని తెలిపింది. అంతర్జాతీయ విమానాల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేసింది. ‘గత రెండు వారాల నుంచే దేశీయ విమానాల్లోని ఎకానమీ క్లాస్‌ ప్రయాణికులకు మాంసాహారం వడ్డించడం లేదు’ అని సంబంధిత అధికారి చెప్పారు. 
 
కాగా ఎయిరిండియాకు రూ. 52వేల కోట్ల వరకు అప్పులున్నాయి. దీంతో సంస్థను ప్రైవేటీకరించేందుకు కేంద్ర కేబినెట్‌ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అయితే ప్రైవేటీకరణ బారినుంచి ఎయిరిండియాను కాపాడుకునేందుకు ఉద్యోగులు ఖర్చు తగ్గింపు ప్రణాళికలను యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
 

వెబ్దునియా పై చదవండి