దేశ వ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ కష్టాలు కలలో కూడా పీడకలలు తెప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త నోట్ల ముద్రణపై కేంద్ర ప్రభుత్వం తన మనసులోని మాటను బహిర్గతం చేసింది. లోక్సభలో విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ఈ సమాచారం ప్రకారం ప్లాస్టిక్ లేదా పాలిమర్ పదార్థంతో బ్యాంకు నోట్లను ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది. ఈ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. కాగితపు కరెన్సీకి బదులుగా ప్లాస్టిక్ కరెన్సీని ముద్రించాలని ఆర్బీఐ ప్రతిపాదించిందా? అన్న ప్రశ్నకు మేఘ్వాల్ ఈ సమాధానం ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన తర్వాత ప్లాస్టిక్ కరెన్సీని ప్రారంభించాలని భారతీయ రిజర్వు బ్యాంకు చాలాకాలంగా ప్రయత్నిస్తోంది.
ఎంపిక చేసిన ఐదు నగరాల్లో రూ.10 విలువైన 100 కోట్ల ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టబోతున్నట్లు 2014 ఫిబ్రవరిలో ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. కొచ్చి, మైసూరు, జైపూర్, సిమ్లా, భువనేశ్వర్లలో వీటిని ప్రవేశపెడతామని పేర్కొంది. ప్లాస్టిక్ నోట్ల జీవిత కాలం సుమారు ఐదేళ్ళు. వాటి నకిలీ నోట్లను తయారు చేయడం చాలా కష్టం. కాగితపు నోట్ల కన్నా ప్లాస్టిక్ నోట్లు పరిశుభ్రంగా ఉంటాయి. నకిలీ నోట్ల బెడదను తప్పించుకునేందుకు మొట్టమొదటిసారి ఆస్ట్రేలియా ఈ నోట్లను ముద్రించి, చలామణిలోకి తీసుకొచ్చింది.