రతన్ టాటా వారసుడుగా నోయన్ టాటా - ఏకగ్రీవంగా ఎన్నిక

ఠాగూర్

శుక్రవారం, 11 అక్టోబరు 2024 (15:42 IST)
టాటా ట్రస్ట్ ఛైర్మన్‌గా నోయల్ టాటా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రతన్‌ టాటా తుదిశ్వాస విడిచిన నేపథ్యంలో ఆయన వారసుడిగా నోయల్‌ టాటాను ఎంపిక చేస్తూ టాటా ట్రస్ట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈయన రతన్‌ టాటాకు వరసకు సోదరుడు అవుతారు. సవతి తల్లి సిమోన్‌ టాటా కుమారుడు. 
 
ఆయన ఇప్పటికే టాటా గ్రూపులోని పలు కంపెనీల్లో వివిధ కీలక హోదాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ట్రెంట్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్‌ కంపెనీలకు ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టాటా స్టీల్, టైటాన్‌కు వైస్‌ ఛైర్మన్‌గానూ ఉన్నారు. రతన్‌ టాటా ట్రస్ట్‌ బోర్డులోనూ నోయల్‌ సభ్యుడిగా ఉన్నారు.
 
టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ అయిన టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్‌కే అత్యధికంగా 66 శాతం వాటా ఉంది. అందువల్ల టాటా టస్ట్‌కు ఛైర్మన్‌ హోదాలో ఉన్న వ్యక్తి.. గ్రూపు కంపెనీల కార్యకలాపాలు, వృద్ధి నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఇప్పటివరకు టాటా ట్రస్ట్‌ ఛైర్మన్‌గా రతన్‌ టాటా ఉన్నారు. 
 
ఆయన మరణంతో టాటా ట్రస్ట్ ఛైర్మన్‌ పదవి ఖాళీ అయ్యింది. ఇప్పుడు ఈ బాధ్యతలను నోయల్‌ టాటాకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పదవి విషయంలో తొలుత వేర్వేరు పేర్లు వినిపించిన్పటికీ.. నోయల్‌ టాటాకే పగ్గాలు అప్పగించడం విశేషం. 
 
ఇక రతన్ టాటా తమ్ముడు జిమ్మీ వ్యాపారంలో అడుగుపెట్టలేదు. దక్షిణ ముంబైలోని కొలాబాలో నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతున్నారు. కేవలం రెండు బెడ్‌రూమ్‌లు ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఆయన నివసిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు