10 వేల మీటర్ల ఎత్తు.. గంటకు 800 కిమీ వేగం... అయినా మాట్లాడుకోవచ్చు

ఆదివారం, 1 అక్టోబరు 2017 (10:39 IST)
విమానంలో ప్రయాణిస్తూ, తమ స్మార్ట్‌ఫోన్ల నుంచి కాల్స్ చేసుకోవాలన్న ప్రయాణికుల కల త్వరలోనే నెరవేరే సమయం ఆసన్నంకానుంది. వైఫై సాయంతో విమానంగాల్లో కాల్స్ చేసుకునే సదుపాయం కల్పించేందుకు ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా) నిర్ణయించుకుంది. ఇందుకోసం విధివిధానాలను తయారు చేసే పనిలో నిమగ్నమైంది. 
 
నిజానికి ఎన్నో దేశాల విమానయాన సంస్థలు ఇప్పటికే ఇన్-ఫ్లయిట్ కనెక్టివిటీ (ఐఎఫ్సీ) సౌకర్యాన్ని ప్రయాణికులకు దగ్గర చేశాయి. కానీ, భారత్‌లో మాత్రం ఈ సౌలభ్యం లేదు. దీంతో గతకొంతకాలంగా ఐఎఫ్సీ సౌకర్యం కల్పించాలని ప్రయాణికుల నుంచి నానాటికీ డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. ఈ డిమాండ్‌కు తగ్గట్టుగా, అందుబాటులోని సాంకేతికతను ఉపయోగించుకుని విమానం గాల్లో ఉన్న వేళ కూడా తమ వారితో మాట్లాడుకునే అవకాశాన్ని కల్పించేందుకు ట్రాయ్ నిర్ణయం తీసుకుంది. 
 
దీంతో గత శుక్రవారం వివిధ ఇండస్ట్రీ సంఘాలు, ప్రజల అభిప్రాయాన్ని కోరుతూ కన్సల్టేషన్ పేపర్‌ను విడుదల చేసింది. దీనిపై ఈ నెల 27లోగా అభిప్రాయాలను లిఖిత పూర్వకంగా తెలియజేయాలని, కౌంటర్ కామెంట్స్‌కు నవంబర్ 3 వరకూ సమయం ఉంటుందని, ఆ తర్వాత తమ తుది నిర్ణయం వెలువడుతుందని ట్రాయ్ స్పష్టం చేసింది. 
 
ఈ విషయంలో అన్ని వర్గాలు సానుకూలంగా స్పందించినట్టయితే, శాటిలైట్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వైఫై తరంగాలను అందుకుని, వాటిని విమానంలోని ప్రయాణికులకు ఉచితంగానే అందించాలన్నది ట్రాయ్ అభిమతం. తొలి దశలో ప్రయోగాత్మకంగా పరిశీలించిన అనంతరం, అన్ని విమానాలకూ ఈ సదుపాయాన్ని కల్పించే దిశగా ట్రాయ్ అడుగులు వేస్తోంది. ఇది విజయవంతమైతే భూ ఉపరితలానికి 10 వేల మీటర్ల ఎత్తులో గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ, తమ బంధుమిత్రులతో మాట్లాడుకునే సౌలభ్యం కలుగనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు