దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పండగ వేళ శుభవార్త అందించింది. జీఎస్పీ 2.0 పేరుతో వాస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో కీలకమైన మార్పులను సోమవారం నుంచి అమల్లోకి తెచ్చింది. నవరాత్రి తొలి రోజైన సోమవారం నుంచి ప్రారంభమైన ఈ కొత్త విధానం వల్ల నిత్యావసరాల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు వందలాది ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. ఈ మార్పులతో ప్రతి కుటుంబంపై ఆర్థిక భారం తగ్గనుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా అన్ని వర్గాల వారికి మేలు చేయనుంది. ఈ పన్ను రేట్ల హేతుబద్ధీకరణ వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.2 లక్షల కోట్ల అదనపు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ కొత్త విధానంలో సామాన్యులు రోజూ వినియోగించే వస్తువులకు పెద్దపీట వేశారు. ముఖ్యంగా ఆహార పదార్థాలపై పన్ను భారం తగ్గించారు.
ప్యాక్ చేసిన పాలు, పన్నీర్, చపాతీలు, పిజ్జా బ్రెడ్ వంటి వాటిపై పన్నును పూర్తిగా రద్దు చేశారు. గతంలో 18 శాతం పన్ను శ్లాబులో ఉన్న వెన్న, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, కాఫీ, ఐస్ క్రీమ్, జామ్ లు, కెచప్లు, బిస్కెట్ల వంటి అనేక వస్తువులను 5 శాతం శ్లాబులోకి తీసుకొచ్చారు.
పండుగ సీజన్ను దృష్టిలో ఉంచుకుని టీవీలు, ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు, ఏసీల వంటి గృహోపకరణాలపై పన్నును 28 శాతం నుంచి 18 శాతం శాతానికి తగ్గించారు. చిన్నకార్లు (1200 సీసీ లోపు), 350సీసీ లోపు మోటార్ సైకిళ్లపై పన్ను 18 శాతంగా ఉంటుంది.
ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై పన్నును పూర్తిగా తొలగించారు. అత్యవసర మందులు, వైద్య పరికరాలపై 5 శాతం పన్ను వర్తిస్తుంది. పెన్సిళ్లు, పుస్తకాలు, మ్యాప్ల వంటి స్టేషనరీ వస్తువులపై పన్ను రద్దు చేశారు.
నిర్మాణ రంగానికి ఊతమిస్తూ సిమెంట్ మీద పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. రూ.7,500 లోపు హోటల్ గదులు, ఎకానమీ విమాన టికెట్లపై 5 శాతం జీఎస్టీ ఉంటుంది.