భారతదేశ ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) సంస్థ రానున్న రెండు సంవత్సరాలలో దాదాపు ఎనిమిది వేలమందిని నియమించేందుకు ప్రణాళికలు రూపొందించుకుందని ఆ సంస్థ అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ బిపి రావ్ తెలిపారు.
ప్రస్తుతం ఆర్థిక మాంద్యం తగ్గుముఖం పడుతుండటంతో తమ సంస్థకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయని, దీంతో తమకు వ్యక్తులు అవసరమని ఆయన అన్నారు. ప్రతి ఏడాది తాము నాలుగు వేలమందిని నియమించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు ఆయన అన్నారు.
గడచిన రెండు సంవత్సరాలలోను ప్రతి ఏడాది నాలుగు వేలమందిని నియమించామని, ఇకపై కూడా ప్రతి ఏడాది నాలుగు వేల మందిని నియమించేందుకు తమ సంస్థ నిర్ణయించిందన్నారు. ప్రస్తుత పంచవర్ష ప్రణాళిలో భాగంగా దాదాపు ఇరవై వేలమందిని నియమించేందుకు లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్నారు. ఇందులో సగానికిపైగా ఉద్యోగులను నియమించినట్లు ఆయన వెల్లడించారు.