ప్రముఖ ఐటి సంస్థ మహీంద్రా సత్యం (సత్యం కంప్యూటర్స్గా సూపరిచితం) సత్యం కంప్యూటర్స్ను టేకోవర్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకూ ఎటువంటి నియామకాలు జరుపలేదు. పైపెచ్చు కొంత మంది సిబ్బందికి పింక్ స్లిప్లు ఇచ్చి ఇళ్లకు కూడా పంపించేసింది. ఇదంతా రామలింగరాజు సృష్టించిన రూ. 14,000 కోట్ల కుంభకోణం ఫలితమే.
అయితే సత్యం కంప్యూటర్స్ సంస్థ మహీంద్రా సత్యంగా మారి 20 నెలలు అయిన తర్వాత మొదటి సారిగా నియమకాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా కొత్తగా మరో 3,000 మంది సిబ్బందిని చేర్చు కోవడం కోసం తాజా గ్రాడ్యుయేట్ల కోసం క్యాంపస్లపౌ దృష్టి సారించింది.
వచ్చే నెలలోనే ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని మహీంద్రా సత్యం రిక్రూట్ మెంట్ హెడ్ ఎంవి శ్రీధర్ తెలిపారు. ప్రస్తుతం మహీంద్రా సత్యంలో 30 వేల మంది ఉద్యోగులున్నారు. అంతే కాకుండా.. గత ఇరవై నెలల్లో మహీంద్రా సత్యం కొత్తగా 35 మంది క్లయింట్లను పొందింది.