12 వేల మందిని నియమించనున్న ఎస్‌బీఐ

బుధవారం, 30 డిశెంబరు 2009 (13:04 IST)
ప్రస్తుతం మార్కెట్ మాంద్యంతో అతలాకుతలమౌతుంటే భారతీయ స్టేట్ బ్యాంక్ 12 వేలమందిని కొత్తగా నియమించనుంది.

దేశంలో అత్యంత పెద్దదైన ఎస్‌బీఐ బ్యాంక్ వచ్చే ఏడాదిలోగా కొత్తగా మరో 12,000 మందిని నియమించనుందని ఆ బ్యాంక్ అధ్యక్షుడు ఓపీ భట్ట్ అన్నారు.

దేశంలో ప్రస్తుతం ఆర్థిక మాంద్యం లేదని, ఉన్నా కూడా అదేమంత పెద్ద సమస్య కాదని ఆయన మీడియాతో ముచ్చటించారు. జమ్‌షెడ్‌పుర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలో ఆర్థిక వృద్ధి ఎనిమిది శాతానికి చేరువలో ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మాంద్యం ఎక్కడుంటుందని ఆయన ప్రశ్నించారు. భారతదేశంలో మాంద్యం తలెత్త లేదని, కాని ఆర్థిక వ్యవస్థ కాస్త మందగించిందని ఆయన అన్నారు.

ప్రభుత్వం గతంలో ప్రకటించిన రాయితీ ప్యాకేజీలు తొలగించనున్న నేపథ్యంలో ప్రభుత్వం మళ్ళీ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఒకవేళ ప్రభుత్వం రాయితీ ప్యాకేజీలను వెనక్కు తీసుకోవాలనుకుంటే దశలవారీగా తొలగిస్తే ఆర్థిక వ్యవస్థ గాడిలో పడినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏదేమైనప్పటికీ తమ బ్యాంక్ తమ వినియోగదారులకు మరిన్న మెరుగైన సేవలను అందించేందుకు మరో 12,000 మందిని కొత్తగా నియమించనున్నామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి