ప్రసిద్ధ మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్ సంస్థ ఉద్యోగావకాశాలు కల్పించనుంది.
తమ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లను నియమించనున్నట్లు ప్రముఖ మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్ సంస్థ వెల్లడించింది. ప్రముఖ 27 నగరాలలో వీరిని నియమించేందుకు తమ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆ సంస్థ తన వెబ్సైట్లో ప్రకటించింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ ప్రసిద్ధి చెందుతోంది. బ్రిట్నీ స్పీయర్స్, బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్లాంటి ప్రముఖులెందరో ఈ మైక్రో వెబ్సైట్ను ఉపయోగిస్తుండటం గమనార్హం. ఈ సంస్థకు చెందిన సేవలను ది న్యూయార్క్ టైమ్స్ వినియోగిస్తోంది. చాలామంది దీనిని తమ సమాచారాన్ని ఇతరులకు అందజేసేందుకు వినియోగిస్తుండటం గమనార్హం. నానాటికీ పెరుగుతున్న ఆదరణను దృష్టిలోవుంచుకుని కంపెనీ సాఫ్ట్వేర్ నిపుణులను నియమించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
తమ వద్ద అత్యంత అనుభవజ్ఞులైన, కష్టించి పనిచేసే సిబ్బంది ఉన్నారని, ఇలాంటివారే మరింతమంది కావాలని ట్విట్టర్ సంస్థ తన వెబ్సైట్లో కోరింది. నిరుడు ఏప్రిల్ నెలలో ఆ సంస్థవద్ద ముఫైకి లోపు సిబ్బంది ఉన్నారని తెలిపింది. ఆ తర్వాత సిబ్బంది సంఖ్యలో పెరుగుదల కనపడి 120కి చేరుకుందని సంస్థ అధికార వర్గాలు పేర్కొన్నాయి.