రానున్న రెండు-మూడు సంవత్సరాలలో టాటా స్టీల్ సంస్థ నుంచి సీనియర్ మేనేజర్ స్థాయి అధికారులు చాలామంది రిటైర్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థ ప్రతిభావంతులు, అనుభవజ్ఞులైన వ్యక్తులను నియమించుకునేందుకు వెతుకులాట ప్రారంభించింది.
తమ సంస్థలోని దాదాపు 25-30 శాతం సీనియర్ మేనేజర్ స్థాయి అధికారులు వచ్చే మూడు సంవత్సరాలలో తమ పదవీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. దీంతో వారి స్థానంలో అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన వారిని నియమించేందుకు తమ సంస్థ కృషి చేస్తోందని టాటా స్టీల్ ఎమ్డీ హెచ్ఎమ్ నెరుర్కర్ కోలకతాలో వెల్లడించారు.
కోలకతాలో నాయకత్వంపై సిఐఐ నేషనల్ కాన్ఫరెన్స్ వారు నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వచ్చే మూడు సంవత్సరాలలో ఇలా ఎక్కువ సంఖ్యలో తమ సంస్థలోని ఉద్యోగులు రిటైర్ కావడంతో తమ సంస్థకు ఇది ఒక ఛాలెంజ్గా ఉందని ఆయన అన్నారు.
తమ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా కార్యాలయాలున్నాయని, పలు ప్రాంతాలలో నియమించేందుకు తమకు అనుభవజ్ఞులైన, మంచి ప్రతిభావంతులైన సిబ్బంది అవసరమని ఆయన పేర్కొన్నారు. మంచి ప్రతిభావంతులైన ఉద్యోగులు తమ సంస్థలో గత కొద్ది సంవత్సరాలుగా పదవీ విరమణ చేస్తున్నారని, దీంతో తమకు ఇది ఓ సమస్యలా పరిణమించిందన్నారు.
ప్రతిభావంతులైన వారిని ఎలా ఉపయోగించుకోవాలో తమ సంస్థ నిత్యం ఆలోచిస్తుంటుందని, వారిలోనున్న సామర్థ్యాన్ని వెలికి తీసి వారిని వృద్ధి చేయడంతోపాటు సంస్థను అభివృద్ధి పథంవైపు పయనింపచేసేందుకు సంస్థలోని ప్రతి ఒక్కరు కృషి చేస్తుంటారని ఆయన పేర్కొన్నారు.