కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. చెన్నైలో తెలుగు టెక్కీ దుర్మరణం

శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (09:37 IST)
చెన్నైలో ఇద్దరు టెక్కీలు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఒకరు తెలుగు టెక్కీ కాగా మరొకరు కేరళ రాష్ట్రానికి చెందిన యువతిగా గుర్తించారు. ఈ ఇద్దరినీ కారు రూపంలో మృత్యువు బలితీసుకుంది. రోడ్డు దాటుతుండగా అమిత వేగంతో వచ్చిన కారు ఒకటి వారిని ఢీకొట్టింది. దీంతో వారు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణం బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుపతికి చెందిన ఎస్.లావణ్య (24), కేరళకు చెందిన ఆర్. శ్రీలక్ష్మి (23)లు చెన్నైలోన ఓఎంఆర్ రోడ్డులో ఉన్న ఓ ఐటీ కంపెనీలో టెక్కీలు పని చేస్తున్నారు. వీరిద్దరూ బుధవారం రాత్రి తమ కార్యాలయం పనులు ముగించుకుని ఇంటికి బయలుదేరారు. 
 
వీరు రోడ్డు దాటుతుండగా, వేగంగా దూసుకొచ్చిన ఓ కారు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక యువతి స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా, మరో యువతి మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. దీంతో కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు