జయలలిత ఆరోగ్యం మెరుగుపడాలని పలు ఆలయాలలో పూజలు కూడా నిర్వహిస్తున్నారు. మరో పక్క వదంతులని నమ్మవద్దని ఏఐఏడీఎంకే నేతలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వదంతుల నేపథ్యంలో జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జయలలిత ఆరోగ్యంపై రకరకాల వదంతులు వస్తున్న నేపథ్యంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫొటో విడుదల చేయాలని కరుణానిధి డిమాండ్ చేశారు.
ఇంకోవైపు వదంతులు సృష్టించిన పలువురిపై అధికారులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కాగా జయలలిత ఆరోగ్య పరిస్థితిని వెంటనే వెల్లడించాలని, లేదంటే వదంతులకు మరింత ఆస్కారం ఇచ్చినట్టు అవుతుందని పలువురు కోరుతున్నారు. ఇదిలావుంటే మధ్యాహ్నం జయలలితను చూసేందుకు రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు మహారాష్ట్రం నుంచి చెన్నైకు వస్తున్నారు. ఆయన నేరుగా అపోలో ఆస్పత్రికి వెళ్లి జయలలితను కలుస్తారు.