దేశ వ్యాప్తంగా క్రిస్మస్ సందడి... నేతల శుభాకాంక్షలు

సోమవారం, 25 డిశెంబరు 2023 (08:25 IST)
క్రిస్మస్‌ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న చర్చిలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. నిర్వాహకులు చర్చిలను రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అందంగా అలంకరించారు. ఘనంగా ఏర్పాట్లు చేశారు. చర్చిల ఆవరణలో క్రీస్తు జననం గురించిన ప్రతిమలతో ప్రదర్శనలను ఏర్పాటుచేశారు. ప్రాత:కాల ప్రార్థనలతో 24వ తేదీ అర్థరాత్రి నుంచే ప్రారంభించారు. అనంతరం బిషప్‌లు, పాస్టర్లు భక్తులకు దైవ సందేశం వినిపించి వ్యాకోపదేశం చేయనున్నారు.
 
కాగా, ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చర్చిగా గుర్తింపు పొందిన మెదక్‌ సీఎస్‌ఐ (చర్చ్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా) వందో పడిలోకి అడుగుపెట్టింది. ఈ చర్చి నిర్మాణం 1914లో మొదలై 1924లో ముగిసింది. అప్పట్లో ఈ చర్చి నిర్మాణానికి 14 లక్షలు అయినట్లు అంచనా. చర్చి 100వ పడిలోకి అడుగిడుతున్న సందర్భంగా ఏడాదిపాటు సంబురాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
 
మరోవైపు, సోమవారం క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని సీఎం రేవంత్‌ రెడ్డి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, సహనం వంటి ఏసుక్రీస్తు బోధనలు అనుసరణీయమన్నారు. రాష్ట్రంలో సెక్యులర్‌ ప్రభుత్వం ఏర్పడిందని, మతసామరస్యాన్ని కాపాడుకుంటూ, పరిపాలన ప్రజాస్వామికంగా, పారదర్శకంగా కొనసాగిస్తామని అన్నారు. క్రైస్తవ కుటుంబాలు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని, క్రీస్తు మార్గాన్ని అనుసరించి సమాజ అభివృద్ధికి అందరూ పాటుపడాలని ఆకాంక్షించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు