'శాంతా క్లాజ్' వస్తున్నాడు... ప్రేమ, ఆరాధనల సమాహారం క్రిస్మస్

శుక్రవారం, 23 డిశెంబరు 2016 (18:53 IST)
క్రైస్తవులకు ముఖ్యమైన పండుగ క్రిస్మస్. ఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా జరుపుకునే ఈ పండుగ ఎంతో పవిత్రమైనది. ఏసు జన్మించి ఇప్పటికి రెండు వేల సంవత్సరాలు దాటిపోయినా ఆయనను కరుణారసమూర్తిగా, దయామూర్తిగా క్రెస్తవుల ఆరాధనలను అందుకుంటున్నారు. రెండు వేల సంవత్సరాల కిందట రోమా సామ్రాజ్యాన్ని ఆగస్టస్ సీజర్ అనే చక్రవర్తి పరిపాలిస్తున్నాడు. ఆయన తన రాజ్యంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో లెక్కవేయించాలనుకున్నాడు. అందుకు వీలుగా ప్రజలందరు ఎవరి స్వగ్రామాలకు వాళ్ళు డిసెంబరు 25 తేదీలోగా వెళ్ళాలని ఆజ్ఞాపించాడు.
 
అప్పుడు 'నజరేతు' అనే పట్టణంలో మేరీ, జోసఫ్ అనే వాళ్ళు నివసిస్తున్నారు. మేరీకి జోసెఫ్‌తో పెళ్ళి కుదిరింది. ఇదిలాఉండగా ఒక రోజున మేరీకి గాబ్రియేల్ అనే దేవదూత కనబడి 'ఓ మేరీ! నీవు దేవుని వలన అనుగ్రహం పొందావు. నీవు కన్యగానే గర్భవతివి అవుతావు. నీవు ఒక కుమారుని కంటావు. అతనికి 'యేసు' అని పేరు పెట్టు. అతడు దేవుని కుమారుడు' అని చెప్పాడు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. మేరీ గర్భవతి అయింది. ఇది తెలిసి జోసెఫ్ ఆమెను పెండ్లాడరాదని, విడిచి పెట్టాలని ఆలోచించసాగాడు. అయితే ఒక రాత్రి కలలో అతనికి దేవదూత కనపడి' మేరీని నీవు విడనాడవద్దు. ఆమె భగవంతుని వరం వలన గర్భవతి అయింది. ఆమెకు పుట్టే కొడుకు దేవుని కుమారుడు. తన్ను నమ్మిన ప్రజలందరిని వాళ్ళ పాపాల నుండి రక్షిస్తాడు.' అని చెప్పాడు. జోసఫ్ న్యాయవంతుడు భక్తుడు. కనుక మేరీని ప్రేమతో ఆదరించాడు.
 
జోసఫ్ స్వగ్రామం బెత్లేహం. అందుచేత వాళ్ళు రాజాజ్ఞను అనుసరించి బెత్లేహేముకు బయలుదేరారు. తీరా వాళ్ళు బెత్లేహేము చేరుకునే సరికి వాళ్ళకక్కడ ఉండటానికి వసతి దొరకలేదు. చివరకు ఒక సత్రపు యజమాని తన పశువుల పాకలో ఉండనిచ్చాడు. అక్కడే మేరీ ఒక శిశువును ప్రసవించింది. ఆ రాత్రి ఆ ఊరికి ప్రక్కనున్న పొలాల్లో కొందరు పశువుల కాపరులు తమ గొర్రెల మందలను కాపలా కాస్తున్నారు. అప్పుడు ఒక దేవదూత ఆకాశం నుంచి వారి ముందుకు దిగి వచ్చాడు. ఆ దూత చుట్టూ ఉన్న వెలుగుకు గొర్రెలకాపరులు భయపడ్డారు. దేవదూత వాళ్ళతో, భయపడకండి. ఇదిగో మీకొక సంతోషకరమైన శుభవార్త. ఇవ్వాళ బెత్లెహేములోని ఒక పశువుల పాకలో, లోక రక్షకుడు పుట్టాడు. ఆయనే అందరికీ ప్రభువు. ఒక పసికందు పొత్తిగుడ్డల్లో చుట్టబడి, పశువుల తొట్టిలో పండుకొని ఉంటాడు. ఇదే మీకు ఆనవాలు. అతడే లోకరక్షకుడు అని చెప్పాడు.
 
దేవదూత ఇలా చెబుతుండగా పొలమంతా ఆకాశం నుండి దిగివచ్చిన దేవదూతలతో నిండిపోయింది. వాళ్ళంతా దేవునికి స్తుతి గీతాలు పాడి మాయమైనారు. గొర్రెల కాపరులు హుటాహుటిన వెళ్ళి దేవదూత చెప్పిన పశువుల పాకను చేరుకున్నారు. అక్కడ పశువుల తొట్టిలో పడుకొని ఉన్న శిశువును, మేరీ, జోసెఫ్‌లను చూశారు. వారు తాము చూచింది, దేవదూత తమకు చెప్పింది అందరికి తెలియజేశారు. అలా రెండు వేల సంవత్సరాల క్రిందట డిసెంబరు 24వ తేదీ అర్థరాత్రి ఏసు క్రీస్తు జన్మించాడు. అందుచేత ఆ మరునాడు అంటే డిసెంబరు 25వ తేదీ క్రిస్మస్ పండుగ.
 
క్రిస్‌మస్‌కు చాలా రోజుల ముందే క్రిస్‌మస్ పండుగ సందడి ప్రారంభమవుతుంది. ఈ పండుగకు క్రైస్తవులు తమ ఇళ్ళను, చర్చీలను చక్కగా అలంకరిస్తారు. వెదురు బద్దలతో రంగు కాగితాలతో, ఒక పెద్ద నక్షత్రాన్ని తయారుచేసి ఇంటి కప్పు మీద ఎత్తుగా పెడతారు. రాత్రి వేళ దీపాలంకరణతో ఇళ్ళు, చర్చీలు అందంగా ఉంటాయి. ప్రతి ఇంట్లోను ఒక క్రిస్‌మస్‌ చెట్టును ఏర్పాటు చేస్తారు. ఇది ఈ పండుగ ప్రత్యేకత. ఈ చెట్టును రంగు కాగితాలతోను, కాగితపు నక్షత్రాలతోను చిరుగంటలతోను చిన్న చిన్న గాజు గోళాలతోను అలంకరిస్తారు. 
 
మరొక విశేషం ఉంది. క్రిస్‌మస్ క్రిందటి రాత్రి 'శాంతా క్లాజ్' ఆకాశం నుండి ధృవపు జింకలు లాగే తన బండిలో వచ్చి పిల్లలకు బహుమతులు ఇచ్చి వెళ్తాడని నమ్ముతారు. అందుకోసం పిల్లలు తమ మేజోళ్ళను వేలాడదీసి ఉంచుతారు. శాంతా క్లాజ్ వాటిలో బహుమతులను పెట్టి వెళ్తాడు. క్రిస్‌మస్ రోజున బంధువుల ఇళ్ళకు మిత్రుల ఇళ్ళకు వెళ్ళి ప్రేమాభిమానాలతో క్రిస్‌మస్ శుభాకాంక్షలు చెబుతారు. క్రిస్‌మస్ సంవత్సరానికి ఒక రోజున వస్తుంది కాబట్టి అది వచ్చేటప్పుడు ప్రేమాభిమానాలను సుఖసంతోషాలను తెస్తుంది.

వెబ్దునియా పై చదవండి