కరోనా టెస్టింగ్‌లో ఆంధ్రప్రదేశ్ రికార్డు : తెలంగాణాలో కొత్త కేసులు

సోమవారం, 30 నవంబరు 2020 (09:47 IST)
కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రికార్డు సృష్టించింది. ఆదివారానికి రాష్ట్రంలో కోటికి పైగా నమూనాలను పరీక్షించారు. ఈ టెస్టింగుల సంఖ్య 1,00,17,126 ఉందని తెలిపారు. తొలి కరోనా కేసు వచ్చిన వేళ, నమూనాలను పరీక్షించేందుకు ల్యాబ్ కూడా లేని స్థితి నుంచి ఇప్పుడు 150 ల్యాబ్‌లలో వేలాది టెస్టులు చేస్తున్నట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా, కరోనా మరణాల సంఖ్య కూడా రాష్ట్రంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే తక్కువగా ఉందని వారు గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం కరోనా నియంత్రణ పద్ధతులను పాటించడంలో ఏపీని పలు రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని తెలిపారు. 
 
కాగా, ఏపీలో తొలి కరోనా అనుమానిత కేసు ఫిబ్రవరి 1న రాగా, శాంపిల్‌ను తెలంగాణలోని గాంధీ ఆసుపత్రికి పంపించారన్న సంగతి తెలిసిందే. ఆపై మార్చి 7న తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరా వైద్య విజ్ఞాన సంస్థలో తొలి టెస్టింగ్ జరిగింది. ఇప్పుడు అన్ని జిల్లాల్లో 150 ల్యాబ్‌లతో పాటు, ప్రభుత్వ ఆధ్వర్యంలో 14 వైరాలజీ ల్యాబ్‌లు, మరో 4 ప్రైవేటు ల్యాబ్‌లలో టెస్టులు చేస్తున్నారు. వీటిల్లో 90 ట్రూనాట్ ల్యాబ్స్ ఉండగా, 6 సీబీనాట్, 5 నాకో, 5 సీఎల్ఐఏ ల్యాబ్ లు, 44 వీఆర్డీఎల్ ల్యా‌బ్‌లు పనిచేస్తున్నాయి.
 
వీటి ద్వారా రోజుకు దాదాపు 75 వేల నమూనాలను పరీశీలిస్తుండగా, శాంపిల్స్‌ను సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 122 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకూ ఏపీలో 8.67 లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదుకాగా, టెస్టుల విషయానికి వస్తే, దేశం మొత్తంలో జరిగిన పరీక్షల్లో ఏపీలోనే 7.18 శాతం జరిగాయి. ఇక కోటికి పైగా నమూనాలను పరీక్షించిన రాష్ట్రాల్లో బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మాత్రమే ఉండటం గమనార్హం. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే, ఏపీలోనే జనాభా తక్కువ.
 
మరోవైపు, తెలంగాణలో గత 24 గంటల్లో 593 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదేసమయంలో 1,058 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,69,816కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,58,336కి మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,458కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 10,637 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. 
 
వారిలో 8,459 మంది హోంక్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 119 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 61 కేసులు నిర్ధారణ అయ్యాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు