రామజన్మభూమి అయోధ్యలో దీపావళి.. దీపాల వరుసతో గిన్నిస్ రికార్డ్

శనివారం, 14 నవంబరు 2020 (13:47 IST)
Deepotsav
దేశవ్యాప్తంగా ప్రజలు దీపావళి పండుగను వేడుకగా జరుపుకుంటున్న వేళ.. రామ జన్మభూమి అయోధ్యలో కొత్త రికార్డు నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో శుక్రవారం రాత్రి నాలుగో దీపోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. లక్షల మట్టి ప్రమిదల్లో ఏర్పాటు చేసిన దీపాలను వెలిగించారు.
 
సాయంత్రం అయోధ్యకు చేరుకున్న గవర్నర్, ముఖ్యమంత్రి మొదటగా శ్రీరాముడిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం సీతారాముడు, లక్ష్మణుడి వేషధారణలో సరయూ నదీతీరంలో పుష్పకవిమానం (హెలికాప్టర్) నుంచి దిగిన కళాకారులను స్వాగతం పలికారు. దీపావళి పండుగ సందర్భంగా అయోధ్యలో నిర్వహించే దీపోత్సవ కార్యక్రమంతో పాటు భౌగోళిక గుర్తింపును తీసుకొచ్చేందుకు యోగి ఆదిత్యనాథ్ ఎంతో కృషి చేస్తున్నారు. ఆలయంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. 
 
దీపావళి సందర్భంగా యూపీ ప్రభుత్వం చేసిన దీపోత్సవం ఏర్పాట్లు ప్రపంచ రికార్డును సృష్టించాయి. శుక్రవారం రాత్రి సమయంలో 8 వేల వాలంటీర్లు సరయూ నదీ తీరాన 6 లక్షలకు పైగా దీపాలు వెలిగించారు. మొత్తంగా 6,06,569 దీపాలను మట్టి ప్రమిదలతో వెలిగించినట్లు వేడుకకు హాజరైన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ప్రతినిధులు ప్రపంచ రికార్డుగా గుర్తించి సర్టిఫికేట్‌ను అందించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు