తెలంగాణాలో కొత్త రకం కరోనా వైరస్.. ఆ రెండు రాష్ట్రాల్లో కూడా...

బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (10:02 IST)
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. అలాగే కొత్త కరోనా వైరస్‌లను కూడా గుర్తిస్తున్నారు. తాజాగా మరో రెండు రకాలను గుర్తించారు. అదేసమంలో మహరాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కేరళ, రాష్ట్రాల్లో కొత్తగా వందలాది కేసులు వెలుగు చూస్తున్నాయి. 
 
అయితే, మహారాష్ట్ర, కేరళలో ఎన్440కె, ఈ484కె రకాలను గుర్తించినట్టు కేంద్రం తెలిపింది. అంతేకాదు, ఇందులో ఒకదాని జాడ తెలంగాణలోనూ కనిపించిందని తెలిపింది. అయితే, పైన చెప్పిన రెండు రాష్ట్రాల్లో కేసుల పెరుగుదలకు ఈ కొత్త రకాలే కారణమని చెప్పలేమని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు.
 
కాగా, ఇప్పటివరకు 3,500 వైరస్ జన్యు పరిమాణ క్రమాలను విశ్లేషించగా, అందులో 187 మందిలో బ్రిటన్ రకం, ఆరుగురిలో దక్షిణాఫ్రికా, ఒక వ్యక్తిలో బ్రెజిల్ రకం వైరస్ సోకినట్టు గుర్తించినట్టు చెప్పారు. వీటి తదుపరి మ్యుటేషన్లపైనా దృష్టిసారించినట్టు తెలిపారు. వైరస్‌లో ఉత్పరివర్తనాలు సహజమేనని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వైరస్‌లో మార్పుల వల్లే కేసులు పెరిగాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు.
 
మరోవైపు, సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ మిశ్రా మాట్లాడుతూ, దేశంలో ఏడు వేలపైగా కరోనా వైరస్‌ ఉత్పరివర్తనాలు ఉన్నాయని.. వీటిలో చాలావరకు తీవ్ర ప్రమాదకారులని వెల్లడించారు. వీటిలో ఎన్‌440కె ఉత్పరివర్తనం దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాపిస్తోందని చెప్పారు. దేశంలో 5 వేలపైగా వైరస్‌ వేరియంట్లపై సీసీఎంబీ విస్తృత విశ్లేషణ చేసిందని ఆయన వివరించారు. వాటి పరిణామ క్రమాన్ని కనుగొనట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తమ పరిశీలనకు నివేదిక రూపం ఇచ్చారు. 
 
కాగా, ప్రతి ఉత్పరివర్తనం కొత్త స్ట్రెయిన్‌ కాదని రాకేశ్‌ మిశ్రా స్పష్టం చేశారు. దేశంలో కరోనా జన్యు విశ్లేషణలో భారత్‌ వెనుకంజలో ఉందని ఆయన విశ్లేషించారు. కోటిపైగా కేసులు నమోదైనా.. అందులో 6,400 (0.06) నమూనాల జన్యువిశ్లేషణ మాత్రమే పూర్తయిన సంగతిని ప్రస్తావించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు