కరోనావైరస్: అమెరికాలో 5 లక్షలు దాటిన మరణాలు, బాధాకరమన్న జో బైడెన్: Newsreeel

మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (12:06 IST)
అమెరికాలో కోవిడ్-19 మరణాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఐదు లక్షలకు చేరడంతో అధ్యక్షుడు జో బైడెన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. "ఈ దారుణమైన విధిని ఒక దేశంగా మనం అంగీకరించలేం. దుఃఖంతో కుంగిపోవడం నుంచి బయటపడాలి" అన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలు, తమ కుటుంబాలతో కలిసి వైట్‌హౌస్‌లో కొవ్వొత్తులు వెలిగించారు. కోవిడ్ మృతులకు సంతాపంగా మౌనం పాటించారు.

 
అమెరికాలో ప్రపంచంలోనే అత్యధికంగా 2 కోట్ల 81 లక్షల మంది కరోనాకు గురయ్యారు. "ఈరోజును అమెరికన్లందరూ గుర్తుంచుకోవాలని నేను కోరుతున్నాను. మనం కోల్పోయినవారిని, మనల్ని వదిలి వెళ్లిపోయినవారిని గుర్తుంచుకోండి" అని బైడెన్ అన్నారు. అంతా కలిసి కోవిడ్‌తో పోరాడదామని ఆయన అమెరికన్లకు పిలుపునిచ్చారు.

 
500 సార్లు మోగిన చర్చి గంట
కోవిడ్ మృతులకు సంతాపంగా మరో ఐదు రోజులపాటు ఫెడరల్ ప్రభుత్వ కార్యాలయాలపై ఉన్న అన్ని అమెరికా జెండాలనూ అవనతం చేయాలని బైడెన్ ఆదేశాలు జారీ చేశారు. అమెరికాలో కరోనా మృతుల సంఖ్య మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు, వియత్నాం యుద్ధ మృతుల సంఖ్యను కూడా దాటిందని చెప్పడానికి ఆయన వైట్‌హౌస్‌లో ప్రసంగించారు.

 
"ఈరోజు చాలా విషాదకరమైన, హృదయవిదారకమైన మైలురాయి లాంటిది. దేశంలో కరోనా వల్ల 5,00,071 మంది చనిపోయారు" అన్నారు. మనల్ని జనం తరచూ మామూలు అమెరికన్లని వర్ణించడం వింటూనే ఉంటాం. కానీ అదేం కాదు, మనకు దూరమైనవారు సామాన్యులు కారు, వారు అసాధారణ వ్యక్తులు. వారు తరాల నుంచీ ఉన్నారు. అమెరికాలో పుట్టారు, అమెరికాకు వలస వచ్చారు. వారిలో ఎంతోమంది అమెరికాలోనే తుదిశ్వాస విడిచారు" అన్నారు.

 
అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక్క రోజు ముందు, జనవరి 19న అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 4 లక్షలకు చేరడంపై ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమానికి బైడెన్ హాజరయ్యారు. నెల తర్వాత కోవిడ్-19 మృతుల సంఖ్య ఐదు లక్షలు దాటడంతో సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించారు.

 
సోమవారం రాత్రి వాషింగ్టన్‌లోని నేషనల్ కాథెడ్రల్ చర్చి గంటను మహమ్మారి వల్ల చనిపోయినవారికి నివాళిగా ప్రతి వెయ్యి మందికి ఒకసారి చొప్పున 500 సార్లు మోగించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు