హెల్త్ కేర్ వర్కర్లకు టీకాలు వేయొద్దు.. కేంద్రం కీలక ఆదేశాలు

ఆదివారం, 4 ఏప్రియల్ 2021 (09:27 IST)
కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. హెల్త్ కేర్ వర్కర్లకు కరోనా టీకాలు వేయొద్దని ఆదేశాలు జారీచేసింది. కొవిన్‌ యాప్‌లో హెల్త్‌కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్ల రిజిస్ట్రేషన్లను అనుమతించొద్దని రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను ఆదేశించింది. 
 
ఈ కేటగిరీలో కొందరు అనర్హులు కూడా నిబంధనలకు విరుద్ధంగా రిజిస్టర్‌ చేసుకొని టీకా వేయించుకుంటున్నారని కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కేటగిరీ కింద ఇప్పటికే రిజిస్టర్‌ చేసుకున్న వారికి వీలైనంత త్వరగా టీకా అందేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.
 
ఈ కేటగిరీలోకి వచ్చేవారు టీకా కోసం రిజిస్టర్‌ చేసుకునేందుకు ఇప్పటికే అనేక సార్లు గడువు పొడిగించినట్లు ఉత్తర్వుల్లో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ పేర్కొన్నారు. ప్రత్యేక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని సాధారణ ప్రజలకు టీకా వేయడం ప్రారంభించిన తర్వాత కూడా వారికి అవకాశం కల్పించామని తెలిపారు. అయినప్పటికీ చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరించి టీకాలు వేసుకోలేదని కేంద్రం పేర్కొంది.
 
వాస్తవానికి మన దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ గత జనవరిలో ప్రారంభమైంది. తొలుత హెల్త్‌కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు అవకాశం కల్పించారు. కానీ, తొలినాళ్లలో టీకా వేసుకునేందుకు చాలా మంది ముందుకు రాలేదు. దీంతో మరోసారి అవకాశం రాదని కేంద్రం స్పష్టంచేసింది. 
 
దీంతో ఈ కేటగిరీల్లో కొంత కదలిక వచ్చింది. అలాగే వైద్యనిపుణుల భరోసా, అవగాహన కార్యక్రమాలతో అనేక మందిలో విశ్వాసం కలిగింది. అయినప్పటికీ ఇప్పటికీ ఈ కేటగిరీలో కొంత మంది టీకా వేసుకోకపోవడం గమనార్హం.
 
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 7.44 కోట్ల టీకా డోసుల్ని పంపిణీ చేశారు. వీరిలో 89,53,552 మంది హెల్త్‌కేర్‌ వర్కర్లు తొలి డోసు, 53,06,671 మంది హెల్త్‌కేర్‌ వర్కర్లు రెండో డోసు తీసుకున్నారు. అలాగే 96,19,289 మంది ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు తొలి డోసు, 40,18,526 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లకు రెండో డోసు టీకా అందించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు