రూ.10 వేలు ఇస్తాం.. పాదపూజ చేస్తాం.. రాష్ట్రానికి రావొద్దు : నాగాలాండ్ విజ్ఞప్తి

శుక్రవారం, 15 మే 2020 (09:55 IST)
వలస కూలీలకు నాగాలాండ్ ప్రభుత్వం ఓ విజ్ఞప్తి చేసింది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలు దయచేసి ఎక్కడివారు అక్కడే ఉండాలని పిలుపునిచ్చింది. పైగా, పది వేల రూపాయలు ఇస్తామని, ఆ డబ్బుతో మరికొద్ది రోజులు ఎక్కడ నివసించేవారు అక్కడే ఉండాలని కోరింది. 
 
కేంద్రం ప్రభుత్వం సడలించిన ఆంక్షల నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు తమతమ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. కొందరు కాలినడకన, మరికొందరు శ్రామిక్ రైళ్ళు, ఇంకొందరు బస్సుల ద్వారా తమతమ రాష్ట్రాలకు చేరుకుంటున్నారు. దీంతో వందల సంఖ్యలో వలస కూలీలు సొంతూర్లకు వెళుతున్నారు. వారికి జరిపే పరీక్షల్లో కరోనా వైరస్ నిర్ధారణ అవుతోంది. 
 
ఈ నేపథ్యంలో నాగాలాండ్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారు ఇప్పుడప్పుడే రావొద్దని, వారందరికీ రూ.10 వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది. వలస కార్మికుల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ప్రస్తుతం నాగాలాండ్ కరోనా రహిత రాష్ట్రంగా ఉంది. ఈ నేపథ్యంలో వలస కూలీలు తిరిగి వస్తే కరోనా ఎక్కడ వ్యాప్తి చెందుతుందోనన్న ఆందోళనతో ఎక్కడి వారు అక్కడే ఉండేలా ఖర్చులు, ఇతర అవసరాల కోసం రూ.10 వేల ఆర్థిక సాయం ప్రకటించింది.
 
వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన దాదాపు 18 వేల మంది నాగాలు స్వరాష్ట్రానికి వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నట్టు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి టెంజెన్ టోయ్ తెలిపారు. అయితే, వారెవరూ ఇప్పుడే రావాల్సిన అవసరం లేదని, ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వృద్ధులు, చికిత్స తీసుకుంటున్న రోగుల ఖర్చుల కోసం రూ.10 వేలు జమచేస్తామని ఆయన వివరించారు. వారు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ఈ మొత్తాన్ని జమచేస్తున్నట్టు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు