ఆంధ్రాలో కరోనా కరాళనృత్యం : ఒకే రోజు 93 మంది మృత్యువాత

ఆదివారం, 23 ఆగస్టు 2020 (19:01 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. ఫలితంగా ఈ వైరస్ బారినపడి ఒకే రోజు ఏకంగా 93 మంది చనిపోయారు. వీరంతా గడచిన 24 గటంల్లో చనిపోయారు. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 16 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 13 మంది, చిత్తూరు జిల్లాలో 11 మంది, కర్నూలు జిల్లాలో 10 మంది మృతి చెందారు. ఈ క్రమంలో మొత్తం మరణాల సంఖ్య 3,282కి పెరిగింది.
 
ఇకకపోతే, కొత్తగా 7,895 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 1,256 కేసులు గుర్తించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,53,111కి చేరగా, తాజాగా 7,449 మంది కోలుకున్నారు. దాంతో ఇప్పటివరకు 2,60,087 మంది సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 89,742 మంది చికిత్స పొందుతున్నారు.
 
మరోవైపు, దేశంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 69,239 మందికి కరోనా సోకింది. అదే సమయంలో 912 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 30,44,941 కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 56,706  పెరిగింది. 
 
ఇక 7,07,668 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 22,80,567 మంది కోలుకున్నారు. కాగా, నిన్నటి వరకు మొత్తం 3,52,92,220 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 8,01,147 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు