భారత్‌లో కరోనా మృతులు 11 ... పాకిస్థాన్‌లో కరోనా కేసులు 959

బుధవారం, 25 మార్చి 2020 (09:05 IST)
భూగోళాన్ని శరవేగంగా చుట్టేస్తున్న కరోనా వైరస్ బారినపడి భారత్‌లో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 11కు చేరింది. అలాగే, ఇప్పటివరకు మొత్తం నమోదైన మొత్తం కేసుల సంఖ్య 536. తమిళనాడు రాష్ట్రంలోని మదురైలో తొలి కరోనా మరణం నమోదైంది. మదురై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన 55 యేళ్ళ వ్యక్తి చనిపోయారు. ఈ విషయాన్ని తమిళనాడు ఆరోగ్య శాఖ ధృవీకరించింది. 
 
మరోవైపు, దాయాది దేశం పాకిస్థాన్‌లో ఈ కేసుల సంఖ్య 959 కాగా, తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. అక్క‌డ అత్య‌ధికంగా సింధూ ప్రావిన్స్‌లో 410, పంజాబ్ ప్రావిన్స్‌లో 267 కేసులు న‌మోదు అయ్యాయి. ఈ నెల 26వ తేదీ వ‌ర‌కు స్వ‌దేశీ విమానాల‌ను పాక్ ప్రభుత్వం రద్దు చేసింది.
 
ఇంకోవైపు, ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మృతుల సంఖ్య 18,810కి చేరింది. కాగా 4,21,413 మంది ఈ వ్యాధి బారిన ప‌డ్డారు. యూరోపియ‌న్ దేశాల్లో క‌రోనా ప్ర‌భావం తీవ్రంగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు యూరోపియ‌న్ దేశాల్లో 10 వేలకు పైగా మృతి చెందారు. 1,95,000 మంది క‌రోనాతో బాధ ప‌డుతున్నారు. 
 
ఇక అమెరికాలో రోజురోజుకు క‌రోనా మృతుల సంఖ్య పెరుగుతుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అధికార ప్ర‌తినిధి మార్గ‌రెట్ హ‌రిస్ పేర్కొన్నారు. క‌రోనా వైర‌స్‌ను అరిక‌ట్టేందుకు ప్ర‌పంచ దేశాలు చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. కాగా, మంగళవారం అర్థరాత్రి నుంచి భార‌త్ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించింది. లాక్‌డౌన్‌తో దేశంలో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతుందని తెలిసినా.. ప్రజల ప్రాణాలే ముఖ్యమని భారత ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు