గర్భిణీలకు కరోనా వ్యాక్సినేషన్ : కేంద్రం మార్గదర్శకాలు ఇవే..

బుధవారం, 30 జూన్ 2021 (14:35 IST)
దేశ ప్రజలు కరోనా వైరస్ బారినపడుకుండా ఉండేందుకు వీలుగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అయితే, గర్భిణులు కూడా టీకాలు వేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. ఇందుకోసం కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. 
 
టీకా వల్ల ప్రయోజనాలు వివరించడంతో పాటు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను గర్భిణులకు వివరించాలంటూ ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు గైడ్‌లైన్స్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ తయారు చేసింది. గర్భిణుల్లో 90 శాతంమందికి కోవిడ్‌ సోకినా ఆస్పత్రి పాలుకాకుండానే నయమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. 
 
కొన్ని కేసుల్లో మాత్రం ఒక్కమారుగా ఆరోగ్యం క్షీణించడం, పిండంపై ప్రభావం చూపడం వంటి దుష్పరిణామాలున్నాయని కేంద్రం తెలిపింది. అందువల్ల వీరు సైతం కరోనా టీకా తీసుకోవాలని సూచించింది. గర్భం వల్ల కరోనా రిస్కు పెరగదని స్పష్టం చేసింది. 
 
గర్భందాల్చిన వారిలో 35ఏళ్ల పైబడినవారు, బీపీ, ఒబేసిటీ వంటి సమస్యలున్నవారికి కరోనా వల్ల రిస్కు అధికమని తెలిపింది. కోవిడ్‌ సోకిన స్త్రీలకు జన్మించిన 95 శాతం మంది శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపింది. ప్రసవానికి ముందు కోవిడ్‌ సోకినట్లయితే ప్రసవానంతరం తొందరగా టీకా తీసుకోవాలని సూచించింది

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు