టెక్కీకి కరోనా వైరస్ ఎలా సోకిందంటే... వివరించిన మంత్రి ఈటల

మంగళవారం, 3 మార్చి 2020 (08:39 IST)
హైదరాబాద్ నగరంలో ఓ కరోనా వైరస్ కేసు నమోదైంది. దేశ వ్యాప్తంగా రెండు కేసులు నమోదయ్యాయి. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వ్యక్తికి ఈ వైరస్ సోకింది. నిజానికి ఈ రోగి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. బెంగుళూరులో పనిచేస్తున్నారు. వయసు 24 యేళ్లు. గత నెల 15వ తేదీన కంపెనీ పనిమీద దుబాయ్‌కు వెళ్లాడు. 
 
ఇతర దేశాలు, ప్రాంతాలకు చెందిన వ్యక్తులతో కలిసి అక్కడ పని చేశాడు. ఫిబ్రవరి 20న తిరిగి బెంగళూరుకు చేరుకున్నాడు. 27న జ్వరం రావడంతో.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. అదే రోజు సికింద్రాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చేరాడు. డాక్టర్లు ట్రీట్‌మెంట్‌ చేసినప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో టెస్టులు చేయించుకోవాలని సూచించారు. 
 
దీంతో మార్చి 1వ తేదీన సాయంత్రం 5 గంటలకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.. గాంధీ ఆస్పత్రిలో చేరాడు. అతనికి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్‌గా ఫలితం వచ్చింది. నిర్ధారణ కోసం పుణెకు కూడా పంపించం.. అక్కడ కూడా పాజిటివ్‌ ఫలితాలే వచ్చాయి. ఇదే విషయాన్ని కేంద్రానికి తెలిపాం. ప్రస్తుతం బాధిత వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ విషయాలను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కరోనా వైరస్‌ నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. 
 
ఇక బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ప్రయాణించిన బస్సులో మొత్తం 27 మంది ప్రయాణికులు ఉన్నారు. వారితో పాటు సికింద్రాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స అందించిన డాక్టర్లు, నర్సులు, ఇతరుల వివరాలు తీసుకున్నాం. కుటుంబ సభ్యుల వివరాలను కూడా సేకరించాం. మొత్తంగా 80 మంది దాకా ఉన్నారు. వీరందరికి కరోనా టెస్టులు చేస్తామని మంత్రి తెలిపారు. వీరందరికి వైరస్‌ సోకినట్లు కాదు.. నిర్ధారణ కోసమే అని మంత్రి వివరించారు. 
 
అలాగే, హైదరాబాద్‌లోని గాంధీ, ఫీవర్‌, చెస్ట్‌ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డుల్లో 40 పడకలను అందుబాటులో ఉంచామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా ఆస్పత్రుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపే ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ఇక మంగళవారం మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై కరోనా వైరస్‌పై చర్చిస్తామని తెలిపారు. 
 
అదేసమయంలో ప్రతి ఒక్కరూ ముక్కుకు గుడ్డ కట్టుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లినప్పడు విధిగా మాస్కు ధరించాలని కోరారు. బహిరంగ ప్రదేశాల్లో దగ్గడం, తుమ్మడం మానుకోవాలి. జ్వరం, జలుబు, దగ్గు ఉంటే తప్పనిసరిగా వైద్యుడి దగ్గరకు వెళ్లి చికిత్స చేయించుకోవాలని మంత్రి చెప్పారు. ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు