కోవిడ్ వ్యాక్సిన్ రష్యాను కోరిన భారత్... పరిశీలిస్తున్నామంటూ వెల్లడి

బుధవారం, 12 ఆగస్టు 2020 (09:29 IST)
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌ విరుగుడుకు రష్యా ఓ వ్యాక్సిన్‌ను కనిపెట్టింది. తొలి వ్యాక్సిన్‌ను ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిరి పుతిన్ కుమార్తెకు వేశారు. ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ప్రకటించారు. 
 
అయితే, ఈ వ్యాక్సిన్ పనితీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు... ఎన్నో దేశాల శాస్త్రవేత్తలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నప్పటికీ, రష్యాపై నమ్మకంతో ఈ వ్యాక్సిన్‌ను తమకు అందించాలని భారత్ సహా 20 దేశాలు కోరాయి. ఈ విషయాన్ని రష్యా స్వయంగా ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
భారత్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, బ్రెజిల్, మెక్సికో, టర్కీ, క్యూబా తదితర దేశాలు 'స్పుత్నిక్ వీ' వ్యాక్సిన్‌ను కోరాయని ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఈ వ్యాక్సిన్‌ను ఆర్డీఐఎఎఫ్ (రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్) సహకారంతో ఈ వ్యాక్సిన్ తయారు చేయడం జరిగింది. 
 
ఈ వ్యాక్సిన్‌ను బుధవారం తొలిసారిగా 2 వేల మంది ప్రజలకు దీన్ని ఇవ్వనున్నారు. సెప్టెంబరులో వ్యాక్సిన్ తయారీని భారీ ఎత్తున ప్రారంభించి, ఈ ఏడాది చివరకు 20 కోట్ల డోస్‌లను తయారు చేసి అందించాలని రష్యా లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ వ్యాక్సిన్ ఫార్ములాను అందిస్తే, తాము కూడా తయారు చేస్తామంటూ పలు దేశాల ఫార్మా కంపెనీలు ముందుకు వస్తున్నాయని, ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని రష్యా పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు