చెన్నైలో ఐపీఎస్ అధికారులనూ వదిలిపెట్టని కరోనా వైరస్

బుధవారం, 13 మే 2020 (08:21 IST)
తమిళనాడు రాష్ట్రాన్ని కరోనా వైరస్ ఓ కుదుపు కుదుపుతోంది. ఈ కరోనా కల్లోలం కారణంగా ప్రతి రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా, రాష్ట్ర రాజధాని చెన్నై మహానగరాన్ని కరోనా వైరస్ దిగ్బంధించింది. ఒక్క చెన్నైలోనే ఏకంగా 4900 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో ఒక్క చెన్నైలోనే సగం కేసులు ఉన్నాయి. పైగా, ఈ కరోనా వైరస్ ఐపీఎస్ అధికారులను సైతం వదిలిపెట్టడం లేదు. 
 
చెన్నైలో ముగ్గురు ఐపీఎస్ అధికారులు మహమ్మారి వైరస్ బారినపడ్డారు. దీంతో కోవిడ్ బారినపడిన మొత్తం పోలీసుల సంఖ్య 190కి పెరిగింది. అలాగే, చెన్నై స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓ హెల్త్ ఇన్‌స్పెక్టర్ కూడా కరోనా సోకింది. దీంతో కరోనా పాజిటివ్ వచ్చిన అధికారులతో పాటు.. వారి కుటుంబ సభ్యులకు క్వారంటైన్ విధించారు. 
 
మరోవైపు, చెన్నైలో ఉన్న కోయంబేడు మార్కెట్ ఈ వైరస్ వ్యాప్తికి కేంద్రంగా మారిన విషయం తెల్సిందే. కోయంబేడు మార్కెట్ ప్రభావం  ఒక్క చెన్నైలోనే కాకుండా ఇతర జిల్లాలైన చెంగల్పట్టు, తిరువళ్లూరు, కడలూరు, అరియలూరు జిల్లాల్లో సైతం కనిపిస్తోంది. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కూడా ఉంది. 
 
ప్రభుత్వం నిన్న విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. చెన్నైలో 4,882, తిరువళ్లూరులో 467, కడలూరులో 396, చెంగల్పట్టులో 391, అరియలూరులో 344, విళుపురంలో 299 కేసులు నమోదయ్యాయి. ఇకపోతే, రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల కేసులు నమోదైవున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు