చిత్తూరు కొంపముంచుతున్న కరోనా, రైతులకు కరోనా, గ్రామాల్లో భయంభయం

మంగళవారం, 12 మే 2020 (22:17 IST)
సరిగ్గా మూడురోజుల క్రితం వరకు చిత్తూరు జిల్లాలో పాజిటివ్ కేసులు 82.. రికవరీ 60కి పైమాటే. ఇక ఉన్న వారు కూడా త్వరలో రికవరీ అయ్యి వెళ్ళిపోతారు. జిల్లాలో పూర్తిగా పాజిటివ్‌లు లేకుండా పోతారు అని అందరూ ఊహించారు. కానీ అంతా రివర్స్. ఒక్కసారిగా చెన్నై కోయంబేడు మార్కెట్ ఎఫెక్ట్ కాస్త చిత్తూరు జిల్లాపై పడింది. 
 
ఒకటి రెండు కాదు ఏకంగా 600 మందికి పైగా రైతులు, డ్రైవర్లు చెన్నై కోయంబేడు మార్కెట్‌కు వెళ్ళి కూరగాయలను విక్రయించి వచ్చారు. కానీ అక్కడి నుంచి వైరస్‌ను అంటించుకొచ్చారు. గత నెల 24వ తేదీన చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, వి.కోట నాగలాపురం ప్రాంతాల నుంచి రైతులు పెద్దఎత్తున కూరగాయలను, పండ్లను విక్రయించేందుకు చెన్నైకు వెళ్ళారు.
 
కోయంబేడు మార్కెట్లో విక్రయాలు జరిపారు. ఏఫ్రిల్ 27వ తేదీన తిరిగి స్వస్థలాలకు చేరుకున్నారు. అయితే సరిగ్గా మూడురోజుల తరువాత వీరిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. అందులో కొంతమంది నేరుగా చిత్తూరు, మదనపల్లె, తిరుపతిలలో ఆసుపత్రికి వెళ్ళారు. రక్తపరీక్షలు చేయించుకున్నారు. ఇప్పటివరకు 365మందికి రక్తపరీక్షలు చేశారు. అందులో 40 మందికి పాజిటివ్‌గా తేలింది. 
 
ఇంకా కొన్ని రిపోర్టులు రావాల్సి ఉంది. ఇంకా చేయాల్సిన రక్తపరీక్షలు చాలానే ఉన్నాయి. అంతేకాదు వీరితో కలిసిన వారు చాలామందే ఉన్నారు. వారు ఇంకా ఆసుపత్రులకు రానేలేదు. బయటే తిరుగుతున్నారు. మూడవ దశ కాంటాక్ట్ రీతిలో వైరస్ వ్యాపిస్తుండటం చిత్తూరు జిల్లా ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా హెల్త్ బులిటెన్లో 131 పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో ప్రజలు భయాందోళన మరింత రెట్టింపవుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు