అంతా మహా కుంభమేళా ఎఫెక్ట్.. కరోనా కేసులు అక్కడే పెరిగాయ్!

శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (15:09 IST)
మహాకుంభమేళా నడపటం ద్వారానే కరోనా కేసులు పెరిగేందుకు ప్రధాన కారణమని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఏడాది మహాకుంబ్‌ కోసం 91 లక్షల మంది యాత్రికులు హరిద్వార్ సందర్శించినట్లు నిర్వాహకులు ప్రకటించారు. మెగా ఈవెంట్‌లోనే వైరస్‌ వ్యాప్తి చెందినట్లు తెలుస్తోంది. 
 
ఇది కోవిడ్‌ ప్రోటోకాల్‌ ఉల్లంఘన కింద అంతా ఆరోపిస్తున్నారు. కేసుల్లో భయంకరమైన పెరుగుదలకు కుంభమేళా రద్దీ ప్రధాన కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
ఈ ఏడాది జనవరి 14 నుంచి ఏప్రిల్‌ 27 వరకు మొత్తం 91 లక్షల మంది యాత్రికులు గంగలో పవిత్ర స్నానం చేసినట్లు కుంభమేళా నిర్వాహకులు తెలిపారు. ఇందులో ఎక్కువ భాగం ఏప్రిల్‌ నెలలోనే వచ్చినట్లు తెలుస్తోంది. కనీసం 60 లక్షల మంది ప్రజలు… ఏప్రిల్‌ నెలలో పుణ్యస్నానాలు చేశారని… అయితే ఇదే మహమ్మారి సెకండ్‌ వేవ్‌కు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
 
ఏప్రిల్ 12న సోమవతి అమావాస్య…. మొదటి షాహి స్నాన్ కోసం అత్యధికంగా 35 లక్షల మంది హరిద్వార్‌ చేరుకున్నారు. మార్చి 11న మహా శివరాత్రి కోసం 32 లక్షల మంది యాత్రికులు స్నానం చేశారు. 
 
ఏప్రిల్ 14న సుమారు 13 లక్షల మంది యాత్రికులు రెండవ షాహి స్నాన్ చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇక మూడవ షాహి స్నాన్‌ కోసం ఏప్రిల్‌ 27న కేవలం 25 వేల మంది మాత్రమే హరిద్వార్‌ వచ్చినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
 
కోవిడ్ ప్రోటోకాల్‌ పెద్దగా పాటించని కారణంగా… కనీసం 100 మంది మేళా అధికారులు అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో నలుగురు మరణించారు. దీంతో ఈ కార్యక్రమాన్ని ముందుగా ముగించేందుకు కొన్ని అఖదా సంస్థలు బలవంతం చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. 
 
ప్రతి 12 సంవత్సరాలకు జనవరి నుంచి ఏప్రిల్ మధ్య మహాకుంభం జరుగుతుంది. ఈ సంవత్సరం, ప్రభుత్వం దీనిని ఒక నెలకు తగ్గించింది. అయితే హరిద్వార్‌లో చివరి రోజు వరకు షాహి స్నాన్‌ కొనసాగింది.
 
హరిద్వార్‌కు వచ్చిన యాత్రికులు… తిరిగి ఆయా రాష్ట్రాలకు వెళ్లడం వల్ల కరోనా వైరస్‌ కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. కుంభమేళా తర్వాత హరిద్వార్‌లో కొవిడ్ -19 పాజిటివ్ కేసులు బాగా పెరిగాయి. ఏప్రిల్ మధ్యలో కేవలం 2 రోజుల వ్యవధిలో 40 లక్షల మంది యాత్రికులు హరిద్వార్ చేరుకున్నారు. దీంతో ఇన్ఫెక్షన్ల సంఖ్య 15వేల నుంచి 30వేలకు పెరిగింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు