దేశంలో కొత్తగా మరో 7,974 పాజిటివ్ కేసులు

గురువారం, 16 డిశెంబరు 2021 (10:17 IST)
దేశంలో కొత్తగా మరో 7,974 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఈ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. అలాగే, ఈ వైరస్ బారినపడి 343 మంది మృత్యువాతపడగా, మరో 7,948 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. 
 
ఇదిలావుంటే, ప్రస్తుతం దేశంలో 8,7245 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. ఇకపోతే, కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,41,54,879గా ఉంది. అలాగే, మరణించిన వారి సంఖ్య 4,76,478గా ఉంది. 
 
ఒమిక్రాన్ కొత్త లక్షణం.. 
ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వైరస్ లక్షణాల్లో మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. రాత్రిపూట విపరీతంగా చెమట పోస్తే ఒమిక్రాన్ సోకినట్టుగా భావించాలని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వేరియంట్ సోకిన వ్యక్తుల్లో డెల్టాకు భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా, ఈ వైరస్ బారినపడిన వారిలో రాత్రిళ్లు విపరీతమైన చెమటతో బాధపడుతున్నారని వైద్యులు వెల్లడించారు. 
 
కోవిడ్ లక్షణాలైన దగ్గు, రన్నింగ్ నోస్, గొంతు నొప్పి, తీవ్రమైన జ్వరం వంటి లక్షణాలు ఒమిక్రాన్ బాధితుల్లో లేవన్నారు. కానీ, తీవ్రమైన తలనొప్పి, ఒళ్లునొప్పులు, స్వల్పంగా జ్వరం, అలసట, గొంతులో దురద వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని ఒమిక్రాన్ వేరియంట్‌ను తొలుత గుర్తించిన డాక్టర్ ఏంజెలిక్ కాట్జీ వెల్లడించారు. ఒమిక్రాన్ వైరస్ బారినపడిన వారిలో చెమట పట్టడం భిన్నమైన లక్షణంగా ఉందని వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు