పీఎం కేర్.. కరోనాపై పోరుకు రూ.3100 కోట్లు కేటాయింపు

బుధవారం, 13 మే 2020 (21:15 IST)
దేశాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని అంతమొందించేందుకు, దానిపై యుద్ధం చేసేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్‌కు భారీ మొత్తంలో విరాళాలు వచ్చాయి. ఈ ఫండ్ నుంచి కరోనాపై పోరుకు భారీగా నిధులు కేటాయించింది. 
 
ఇదే అంశంపై పీఎంవో కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనాపై పోరుకు పీఎం కేర్స్ ఫండ్‌ నుంచి రూ.3100 కోట్లను కేంద్రం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుందని అందులో పేర్కొంది. ఈ నిధులతో వైద్య పరికరాల కొనుగోలుకు కేంద్రం పెద్దపీట వేసింది.
 
ఈ డబ్బులో వెంటిలేటర్ల కొనుగోలుకు రూ.2000 కోట్లను కేటాయించినట్లు కేంద్రం పేర్కొంది. రూ.100 కోట్లను వ్యాక్సిన్ అభివృద్ధికి కేటాయించింది. వలస కార్మికులకు కూడా అండగా నిలవాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా.. రూ.1000 కోట్లను వలస కార్మికుల కోసం కేటాయించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిది. 
 
మరోవైపు, కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్రం చేయని పోరాటమంటూ లేదు. ఈ క్రమంలో దేశంలో కరోనా వైరస్‌ను నియంత్రించడం కోసం చేపడుతున్న చర్యలకు బ్రిక్స్ దేశాలకు చెందిన 'న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు' ఆర్థికసాయం ప్రకటించింది. 
 
ఇందులోభాగంగా, భారత్‌కు 1 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.7.5వేల కోట్లపైగా రుణం అందించాలని ఈ బ్యాంకు నిర్ణయించింది. ఏప్రిల్ 30న ఈ రుణానికి బ్యాంకు ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. కరోనా వ్యాప్తిని నిరోధించి తద్వారా సామాజిక, ఆర్థిక, ప్రాణ నష్టాలు జరగకుండా చూసేందుకు ఈ రుణం అందిస్తున్నట్లు తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు