ఆగస్టు నుంచి భారత్‌లో స్పుత్నిక్‌ వి ఉత్పత్తి

శనివారం, 22 మే 2021 (21:01 IST)
రష్యా అభివృద్ధి చేసిన ‘స్పుత్నిక్‌ వి’ టీకాను ఈ ఏడాది ఆగస్టు నుంచి భారత్‌లోనే ఉత్పత్తి చేయనున్నట్లు రష్యాకు భారత రాయబారి డీబీ వెంకటేశ్‌ వర్మ శనివారం వెల్లడించారు. మే చివరి నాటికి 30లక్షల స్పుత్నిక్‌ వి డోసులు భారత్‌కు రానున్నాయని, జూన్‌లో మరో 50లక్షల డోసుల దిగుమతి కానున్నట్లు తెలిపారు.
 
‘‘స్పుత్నిక్‌ వి’ టీకాలు మూడు దశల్లో భారత్‌కు రానున్నాయి. తొలి దశలో పూర్తిగా తయారైన టీకాలను రష్యా నుంచి పంపిస్తారు. ఇది ఇప్పటికే ప్రారంభమైంది. రెండో దశలో ఆర్‌డీఐఎఫ్‌ రూపంలో డోసులను పంపిస్తారు. ఇవి కూడా నేరుగా వినియోగించుకోవచ్చు అయితే దీన్ని భారత్‌లో బాటిళ్లలో నింపాల్సి ఉంటుంది.

ఇక మూడోది.. రష్యా కంపెనీ భారత కంపెనీకి టీకా టెక్నాలజీని పంపిస్తుంది. అప్పుడు భారత కంపెనీ ఇక్కడే పూర్తిగా టీకాల ఉత్పత్తి ప్రారంభిస్తుంది’’ అని వెంకటేశ్‌ వర్మ వెల్లడించారు. ప్రస్తుతమున్న ప్రణాళిక ప్రకారం.. మొత్తం 85కోట్ల డోసుల స్పుత్నిక్‌ వి టీకాలను భారత్‌కు అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే రెండు విడతల్లో 1,50,000.. 60వేల డోసులు భారత్‌కు చేరాయని చెప్పారు.
 
రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) సహకారంతో గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ ఈ టీకాను అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లో తయారీ, పంపిణీ చేసేందుకు ఆర్‌డీఐఎఫ్‌తో డాక్టర్‌ రెడ్డీస్‌ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్పుత్నిక్‌ వి అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ డాక్టర్‌ రెడ్డీస్‌ చేసుకున్న దరఖాస్తుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇటీవలే ఈ టీకా అందుబాటులోకి వచ్చింది. ఒక్కో డోసు ధర రూ. 995.40(జీఎస్‌టీతో కలిపి)గా నిర్ణయించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు