తెలంగాణాలో కలకలం : ఒకే రోజు ఆరుగురు మృతి.. మొత్తం 8

మంగళవారం, 31 మార్చి 2020 (09:00 IST)
తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ మరింతంగా కలకలం రేపుతోంది. అటు కొత్త కేసుల నమోదులోనూ, మరణాల సంఖ్యలోనూ ఏమాత్రం తగ్గుముఖంపట్టలేదు. ఫలితంగా సోమవారం ఒక్క రోజే ఏకంగా ఆరుగురు కరోనా వైరస్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో తెలంగాణాలో ఇప్పటివరకు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. 
 
హైదరాబాద్ నగరంలో తొలుత 67 యేళ్ళ వృద్ధుడు చనిపోయాడు. ఈయన చనిపోయిన తర్వాత ఈయనకు కరోనా సోకిందనే విషయం తేలింది. ఆ తర్వాత సోమవారం మరో వ్యక్తి చనిపోయారు. కానీ, రాత్రికి మరో ఆరుగురు చనిపోయారు. దీంతో కరోనా వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కార్యాలయం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ఈ ఆరుగురూ, న్యూఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు హాజరైనవారేనని స్పష్టం చేసింది.
 
ఇకపోతే, "న్యూఢిల్లీలో మార్చి 13 నుంచి 15 వరకూ జరిగిన మర్కజ్‌లో పాల్గొని వచ్చి, కరోనా వ్యాధి బారిన పడిన ఆరుగురు తెలంగాణలో మరణించారు. ఇద్దరు గాంధీ ఆసుపత్రిలో చనిపోగా, అపోలో హాస్పిటల్, గ్లోబల్ హాస్పిటల్, నిజామాబాద్, గద్వాల్ ఆసుపత్రుల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు" అని సీఎంఓ పేర్కొంది. 
 
ఆపై "కరోనా ప్రభావిత ప్రాంతాల్లో వైరస్ లక్షణాలున్న వారిని గుర్తించేందుకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి. గుర్తించిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నాం. మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారు స్వచ్ఛందంగా ఆసుపత్రుల్లో రిపోర్ట్ చేయాలని తెలంగాణ వైద్య విభాగం విజ్ఞప్తి చేస్తోంది" అని ట్వీట్ చేసింది.
 
"మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించి, ఉచితంగా చికిత్స కూడా అందిస్తుంది. వారి గురించి ఎవరికి సమాచారం ఉన్నా వెంటనే ప్రభుత్వానికి తెలియపరచాలని వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేస్తున్నది" అని కూడా తెలంగాణ సీఎంఓ ట్వీట్ పెట్టింది. మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారిలో ఎవరినైనా ప్రజలు గుర్తిస్తే, వెంటనే వైద్య విభాగానికి తెలియజేయాలని కోరింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు