ఒమిక్రాన్‌పై పనిచేయని టీకా - దేశంలో పెరుగుతున్న కేసులు

మంగళవారం, 14 డిశెంబరు 2021 (11:31 IST)
మొన్నటివరకు కరోనా వైరస్‌తో ప్రజలు వణికిపోయారు. ఈ వైరస్ ఇప్పటికీ వదిలివెళ్లలేదు. ఇంతలోనే సౌతాఫ్రికాలో ఒమిక్రాన్ వైరస్ పుట్టుకొచ్చింది. ఈ వైరస్ శరవేగంగా ప్రపంచ దేశాలకు పాకుతోంది. ఇలాంటి దేశాల్లో మన దేశం కూడా ఉంది. భారత్‌లో ఇప్పటికే ఏకంగా 38 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ గట్టి హెచ్చరిక చేసింది. 
 
ఒమిక్రాన్‌‍లపై టీకా పని చేయడం లేదని స్పష్టంచేసింది. ఒమిక్రాన్‌తో స్వల్ప లక్షణాలే కనిపించినప్పటికీ.. దీని తీవ్రవతపై అపుడే ఓ నిర్ణయానికి రావొద్దంటూ హెచ్చరించింది. ఈ వైరస్ డెల్టా కంటే వేగంగా వ్యాపించే గుణం ఉందని పేర్కొంది. ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన డేటా విశ్లేషిస్తే, వైరస్ సామాజిక వ్యాప్తి (కమ్యూనిటి స్ప్రెడ్) చేరితే డెల్టా వేరియంట్ కేసులను ఒమిక్రాన్ వైరస్ కేసులు మించిపోవచ్చని తెలిపింది. 
 
అయితే, ఒమిక్రాన్ సోకితే లక్షణాలు స్వల్పంగానే ఉంటున్నట్టు ప్రాథమిక సమాచారం తేలినట్టు తెలిపింది. కానీ, ఈ లక్షణాలపై ఇపుడే ఓ నిర్ధారణకు రావొద్దని, ఎందుకంటే అందుబాటులో ఉన్న సమాచారం చాలా తక్కువగా అని తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే 63 దేశాలకు వ్యాపించిందని గుర్తుచేసింది.
 
ఇదిలావుంటే, భారత్‌లో కూడా ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతున్నాయి. మంగళవారం ఉదయం వరకు దేశ వ్యాప్తంగా 38 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్, కేరళ, చండీగఢ్ రాష్ట్రాల్లో తొలిసారి ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
అలాగే, కర్నాటక, మహారాష్ట్రలోనూ ఒక్కో కేసు నమోదైంది. ఇప్పటివరకు మహారాష్ట్రలో 18, రాజస్థాన్‌లో 9, కర్నాటకలో 3, ఢిల్లీలో 2, కేరళ, చండీగఢ్‌లలో ఒక్కొక్కటి చొప్పున ఈ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు