కరోనా.. సౌదీలో ప్రియుడి తండ్రి.. వచ్చాకే పెళ్లి.. మనస్తాపంతో ప్రేయసి మృతి

మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (14:31 IST)
కరోనా కారణంగా వివాహం ఆలస్యం అవుతుందనే మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని బెజ్జంకి మండలం ఎల్లంపల్లికి చెందిన వడిగె శిరీష, కోహెడ మండలం మైసంపల్లికి చెందిన వజ్జెపల్లి శ్రావణ్‌ గత మూడేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించాయి. త్వరలో పెళ్లి కావాల్సి ఉంది. 
 
సౌదీ అరేబియాలో గొర్ల కాపరిగా పని చేస్తున్న శీరిష తండ్రి నర్సింగం వస్తేనే పెళ్లి జరుగుతుంది. లాక్ డౌన్‌ కారణంగా అతడు సౌదీలోనే చిక్కుకుని పోయాడు. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గి, అంతర్జాతీయ విమానాలు నడుస్తే తప్ప రాలేని పరిస్థితి.
 
ఈ నేపథ్యంలో తండ్రి రాక ఆలస్యం అవుతుందని తనకు పెళ్లి జరిపించేయాలని శిరీష్ తల్లిని కోరింది. తండ్రి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందువని తల్లి పలుమార్లు శిరీషకు నచ్చచెప్పింది. పెళ్లి ఆలస్యం అవుతోందని శిరీష తీవ్ర మనస్తాపానికి గురైంది.
 
గతనెల 28న శిరీష పురుగుల మందు తాగింది. దీంతో ఆమెను కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఇన్ని రోజులు మృత్యువుతో పోరాడి సోమవారం రాత్రి తుది శ్వాస విడిచింది. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు