కాస్త శాంతించిన కరోనా - స్పుత్నిక్ వి మూడో దశ ట్రయల్స్ ప్రారంభం

మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (10:08 IST)
దేశంలో కరోనా వైరస్ కాస్త శాంతించింది. గత రెండు రోజులతో పోల్చుకుంటే గడచిన 24 గంటల్లో నమోదైన కొత్త కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 75 వేలుగా నమోదైంది. గత రెండు రోజుల్లో ఈ సంఖ్య 90 వేలకు పైగా ఉన్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో గత 24 గంటల్లో దేశంలో 75,809 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఉదయం వెల్లడించిన బులెటిన్‌లో పేర్కొంది. అదేసమయంలో 1,133 మంది మృతి చెందారు.
 
ఇకపోతే, దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 42,80,423కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 72,775కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 33,23,951 మంది కోలుకున్నారు. అలాగే, దేశంలో ప్రస్తుతం 8,83,697 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 
 
అదేసమయంలో సోమవారం వరకు మొత్తం 5,06,50,128 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. సోమవారం ఒక్కరోజులోనే 10,98,621 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
దేశంలో మూడో దశ ట్రయల్స్.. 
ఇకపోతే, రష్యా కరోనా టీకా "స్పుత్నిక్ వి''కి భారత్‌లో మూడో దశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెలలోనే పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతుండగా, వాటి ఫలితాలు మాత్రం నవంబరులో రానున్నట్టు రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌ సీఈవో క్రిల్‌ ద్మిత్రియేవ్‌ సోమవారం తెలిపారు. 
 
భారత్‌తోపాటు సౌదీ అరేబియా, యూఏఈ, ఫిలిప్పీన్స్, బ్రెజిల్ వంటి దేశాల్లోనూ స్పుత్నిక్ వికి మూడో దశ పరీక్షలు నిర్వహించనున్నారు. అందరి కంటే ముందుగా వ్యాక్సిన్‌ను రిజిస్టర్ చేసి, రష్యా సంచలనం సృష్టించిన సంగతి విదితమే. అయితే, ఈ వ్యాక్సిన్ సమర్థతపై ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు పలు దేశాలు పెదవి విరిచాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు