మెల్‌బోర్న్‌ టెస్ట్ : భారత్ 326 ఆలౌట్ - 131 పరుగుల ఆధిక్యం

సోమవారం, 28 డిశెంబరు 2020 (09:42 IST)
మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ క్రికెట్ జట్ల మధ్య బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ మ్యాచ్ సిరీస్ జరుగుతోంది. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ చిత్తుగా ఓడిపోయింది. ఇపుడు రెండో టెస్ట్ మ్యాచ్ మెల్‌బోర్న్ వేదికగా సాగుతోంది. ఇందులో భారత జట్టు పట్టు బిగించింది. 
 
తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ఆసీస్‌పై 131 పరుగుల ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 277/5తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ వడివడిగా వికెట్లు కోల్పోయింది. కేవలం 49 పరుగులు మాత్రమే జోడించి చివరి ఐదు వికెట్లు చేజార్చుకుంది. 
 
టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీలో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన అజింక్యా రహానే సెంచరీతో అదరగొట్టాడు. 223 బంతుల్లో 12 ఫోర్లతో 112 పరుగులు చేసిన రహానే రనౌట్‌గా వెనుదిరిగాడు. 
 
రవీంద్ర జడేజా 57 పరుగులు చేశాడు. అశ్విన్ 14, ఉమేశ్ యాదవ్ 9 పరుగులు చేయగా, జస్ప్రీత్ బుమ్రా డకౌట్ అయ్యాడు. సిరాజ్ (0) నాటౌట్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, నాథన్ లయన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, కమిన్స్ రెండు, హేజిల్‌వుడ్ ఒక వికెట్ తీసుకున్నాడు. 
 
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు 27.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. ఓపెనర్ బోర్న్ 4 పరుగుల వద్ద యాదవ్ బౌలింగ్‌లో కీపర్‌ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 
 
అలాగే, లబుసర్గానే కూడా 28 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరగా, ప్రస్తుత క్రీజ్‌లో మ్యాథ్యూ హేడ్ 27, స్టీవెన్ స్మిత్ 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు