కొలంబోలో వారం రోజుల పాటు వర్షాలే వర్షాలు... వేదిక మార్పు?

సోమవారం, 4 సెప్టెంబరు 2023 (10:25 IST)
ఆసియా సభ్య దేశాల మధ్య క్రికెట్ టోర్నీ జరుగుతుంది. ఇప్పటికే ఈ టోర్నీ ప్రారంభమైంది. అయితే, కీలకమైన భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కు వరుణ దేవుడు అడ్డుపడ్డాడు. దీంతో క్రికెట్ ప్రపంచం ఎంతగానో అమితాసక్తితో ఎదురు చూసే ఈ మ్యాచ్ ఎలాంటి ఫలితం తేలకుండానే రద్దు అయింది. ఇదిలావుంటే, ఈ టోర్నీకి ఆతిథ్యమిచ్చే నగరాల్లో ఒకటైన కొలంబో నగరంలో వచ్చే వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈ వేదికపై జరిగే మ్యాచ్‌లను మరో చోటికి మార్చలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. ముఖ్యంగా, పల్లెకెలె లేదా దంబుల్లా స్టేడియాల్లో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
 
వచ్చే వారం రోజుల పాటు కొలంబోలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అక్కడ జరగాల్సిన మ్యాచ్‌లను మరో స్టేడియాలో నిర్వహించాలని సూచన ప్రాయంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి ఐదు సూపర్-4 మ్యాచ్‌లకు కొలంబోలో జరగాల్సివుంది. వర్షాలు కురుస్తాయని హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన ఏసీసీ ఈ మ్యాచ్‌లను దంబుల్లా లేదా పల్లెకెలెలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే విషయంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుతో ఏసీసీ ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారు. 
 
ఆసియా కప్ : బోణీ కొట్టిన బంగ్లాదేశ్... 
 
శ్రీలంక వేదికగా జరుగుతున్న ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. గ్రూపు-బిలో భాగంగా ఆదివారం జరిగిన పోరులో బంగ్లాదేశ్ జట్టు 89 పరుగుల తేడాతో ఆప్ఘనిస్థాన్ జట్టును ఓడించింది. తద్వారా ఓ టోర్నీలో బంగ్లాదేశ్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. తన మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు శ్రీంలక చేతిలో ఓడిపోయిన విషయం తెల్సిందే. 
 
అయితే, ఆదివారం ఆప్ఘనిస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం బంగ్లా కుర్రోళ్లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 334 పరుగుల భారీ స్కోరు చేసింది. జట్టులో మిరాజ్ (112), హుస్సేన్ శాంటో (104)లు సెంచరీలతో రెచ్చిపోయారు. 
 
ఆ తర్వాత భారీ లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన క్రికెట్ పసికూన ఆప్ఘన్ జట్టు 44.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులో ఇహ్రహీం జాద్రాన్ 75 పరుగులతో రాణించాడు. కెప్టెన్ హష్మతుల్లా షాహిది 51, రహ్మత్ షా 33, రషీద్ ఖాన్ 24 పరుగులు చేశారు. రన్ రేట్ మెరుగ్గానే ఉన్నప్పటికీ వికెట్లు కోల్పోవడంతో ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు ఓటమి తప్పలేదు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 4, షోరిఫుల్ ఇస్లామ్ 3, హసన్ హ్మూద్ 1, మెహెదీ హసన్ 1 వికెట్ తీశారు. మరోవైపు, ఆసియా కప్ టోర్నీలో భాగంగా, సెప్టెంబరు 4వ తేదీ సోమవారం భారత్, నేపాల్ జట్లు తలపడుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు