మాజీ క్రికెటర్లు - మాజీ అంపైర్లకు బీసీసీఐ శుభవార్త

మంగళవారం, 14 జూన్ 2022 (07:54 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మాజీ క్రికెటర్లు, మాజీ అంపైర్లకు శుభవార్త చెప్పింది. వీరికి కొత్త పెన్షన్ పథకాన్ని అమలు చేయనున్నట్టు ప్రకటించింది. పురుష, మహిళా మాజీ క్రికెటర్లకు, మాజీ అంపైర్లకు ఇచ్చే నెలవారీ పెన్షన్ మొత్తాన్ని పెంచుతున్నట్టు బీసీసీఐఓ ప్రకటనలో పేర్కొంది. 
 
ఇదే అంశంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందిస్తూ, మాజీ ఆటగాళ్ల ఆర్థిక పరిస్థితులను కూడా మేం పరిగణలోకి తీసుకోవాల్సివుందన్నారు. క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెప్పిన తర్వాత వారి బాగోగులు చూసుకోవడం బోర్డు కర్తవ్యమన్నారు. నిజానికి మాజీ క్రికెటర్ల కంటే మాజీ అంపైర్లకు పెద్దగా గుర్తింపు ఉండదన్నారు. ఇలాంటి వారిని ఆదుకుని, వారి సేవలకు ఎంతో విలువ ఇవ్వాల్సివుందన్నారు. 
 
మరోవైపు, వీరికి నెలకు రూ.15 వేలు పెన్షన్ ఇస్తుండగా, ఇపుడు ఈ మొత్తాన్ని రెట్టింపు చేసి రూ.30వేలుగా ఇవ్వనున్నారు. అలాగే  రూ.22500 అందుకునేవారు రూ.45000, రూ.30 వేలు అందుకునేవారు రూ.52 వేలు, రూ.37500 అందుకునేవారు రూ.60 వేలు, రూ.50 వేలు అందుకునేవారు రూ.70 వేలు చొప్పున పెన్షన్ అందుకుంటారని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు