ఐపీఎల్ పోటీలకు కేంద్రం పచ్చజెండా - స్పాన్సర్ రేసులో పతంజలి!!!

సోమవారం, 10 ఆగస్టు 2020 (19:03 IST)
ఒకవైపు ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి పట్టిపీడిస్తోంది. దీంతో అనేక క్రీడా సంగ్రామాలు వాయిదాపడ్డాయి. అయితే, గత కొన్ని రోజులుగా పరిస్థితులు కుదుటపడుతున్నాయి. దీంతో కొన్ని దేశాల్లో పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఫలితంగా క్రీడా పోటీలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులోభాగంగా, ఇప్పటికే ఇంగ్లండ్ వేదికగా ఇంగ్లండ్ - పాకిస్థాన్ దేశాల మధ్య క్రికెట్ పోటీలు కూడా జరిగాయి. ఇపుడు పరాయి గడ్డపై కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీలను యూఏఈ గడ్డపై నిర్వహించేందుకు కేంద్రం కూడా పచ్చజెండా ఊపింది. 
 
ప్రధానంగా, కేంద్ర ప్రభుత్వం ఈ టోర్నీ నిర్వహణకు సంబంధించి కీలక అనుమతి మంజూరు చేసింది. యూఏఈలో ఐపీఎల్ నిర్వహణకు ఎలాంటి అభ్యంతరాలు లేవంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఐపీఎల్ ఛైర్మన్ బ్రజేశ్ పటేల్ వెల్లడించారు. భారత కేంద్ర ప్రభుత్వం నుంచి బీసీసీఐకి ఈ మేరకు అనుమతి పత్రం వచ్చిందని వివరించారు. 
 
కరోనా వ్యాప్తి నేపథ్యంలో లీగ్‌ను భారత్‌లో జరిపే వీల్లేకపోవడంతో ఐపీఎల్ వేదిక యూఏఈకి మార్చారు. మారిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరు 19న టోర్నీ ప్రారంభమై, నవంబరు 10న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. కాగా, టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. రేసులో భారత్‌కు చెందిన ప్రముఖ సంస్థ పతంజలి పోటీపడుతోంది. 
 
భారత్ - చైనా దేశాల మధ్య ఏర్పడిన సరిహద్దు ఉద్రిక్తల కారణంగా వివో తప్పుకుంది. దాంతో ఐపీఎల్‌కు కొత్త స్పాన్సర్ కోసం బీసీసీఐ ద్వారాలు తెరిచింది. విశేషమైన బ్రాండ్ నేమ్ ఉన్న ఐపీఎల్‌ను స్పాన్సర్ చేయడం ద్వారా తమ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచుకోవాలని బడా కంపెనీలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే అమెజాన్, జియో, టాటా గ్రూప్, డ్రీమ్ 11, అదానీ గ్రూప్, బైజు యాప్ రేసులో ఉన్నాయి. తాజాగా, యోగా గురు బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి గ్రూపు కూడా ఈ పోటీలో అడుగుపెట్టింది.
 
ఈ ఏడాది ఐపీఎల్‌ను స్పాన్సర్ చేసే అవకాశం కోసం తాము కూడా ప్రయత్నిస్తున్నట్టు పతంజలి గ్రూప్ ప్రతినిధి పేర్కొన్నారు. పతంజలి గ్రూపు గ్లోబల్ మార్కెట్లో ఓ బ్రాండ్‌గా ఎదిగేందుకు ఐపీఎల్ మంచి వేదిక అని భావిస్తున్నామని తెలిపారు. స్పాన్సర్ షిప్ కోసం బీసీసీఐకి ప్రతిపాదనలు పంపుతున్నట్టు వెల్లడించారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు