సెహ్వాగ్‌, రవిశాస్త్రి మధ్యే పోటీ. కోచ్ అయితే మాత్రం సెహ్వాగ్ నోరు కట్టేసుకోవాల్సిందే

శనివారం, 1 జులై 2017 (06:16 IST)
టీమిండియా మాజీ డైరెక్టర్‌ రవిశాస్త్రి కూడా రేసులోకి రావడంతో సెహ్వాగ్‌, రవిశాస్త్రి, టామ్‌ మూడీ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. భారత క్రికెట్‌ జట్టు కోచ్‌ పదవి ఎవరికి దక్కుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. జులై 9న కోచ్‌ ఎవ్వరన్నది ప్రకటిస్తామని చెప్పారు. దీంతో కోచ్‌ ఎవరన్న దానిపై అభిమానులందరూ ఎదురుచూస్తున్నారు. 
 
మే నెలలో బీసీసీఐ తొలిసారి దరఖాస్తులు ఆహ్వానించినప్పుడు సెహ్వాగ్‌ దరఖాస్తు చేశాడు. సోషల్‌మీడియాలో ఎప్పుడూ చలాకీగా ఉంటే సెహ్వాగ్‌ కోచ్‌ కోసం రెండు లైన్ల దరఖాస్తు పంపాడని చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఓ మీడియా సమావేశంలో సెహ్వాగ్‌ మాట్లాడుతూ... రెండు లైన్ల దరఖాస్తు పంపితే అందులో నా పేరు మాత్రమే ఉంటుంది అని చెప్పడంతో ఆ గొడవ అంతటితో సద్దుమణిగింది.
 
రవిశాస్త్రికి సారథి విరాట్‌ కోహ్లీ మద్దతు పలుకుతుండగా, బీసీసీఐ కోశాధికారి అనిరుధ్‌ చౌదరి.. వీరేంద్ర సెహ్వాగ్‌కు మద్దతిస్తున్నారు. ఈ సందర్భంగా అనిరుధ్‌ మాట్లాడుతూ.. ఒకవేళ సెహ్వాగ్‌ కోచ్‌గా ఎంపికైతే నోటిని కాస్త అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుందన్నారు. 
 
అవును.. సెహ్వాగ్‌ సోషల్‌మీడియాలో చాలా చురుకుగా ఉంటాడు. కోచ్‌గా ఎంపికైతే మాత్రం అలా ఉండటానికి కుదరదు. ఏదైనా మ్యాచ్‌, సిరీస్‌ గెలిచినా, ఓడిపోయినా చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటోంది. సోషల్‌ మీడియాకి కాస్త దూరంగానే గడపాల్సి ఉంటుంది అని అనిరుధ్‌ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి