భారత మాజీ క్రికెటర్ చేతన చౌహాన్‌ను చంపేసిన కరోనా వైరస్

ఆదివారం, 16 ఆగస్టు 2020 (23:02 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ ఇకలేరు. కరోనా వైరస్‌తో పాటు.. ఇతర అనారోగ్య సమస్యల కారణంగా ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈయన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. ఆదివారం హర్యానా రాష్ట్రంలోని గుర్గావ్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. 
 
కోవిడ్-19 చికిత్స కోసం ఇటీవల ఆయన మేదాంత ఆసుపత్రిలో చేరారు. శనివారం ఆయన ఆరోగ్యం విషమించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో ఆయన సైనిక సంక్షేమం, హోం గార్డ్స్, పౌర భద్రత, ప్రాంతీయ రక్షాదళ్ మంత్రిగా ఉన్నారు. చౌతన్ చౌహాన్ మృతి పట్ల యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 
 
మరోవైపు, చేతన్ చౌహాన్ 1970 దశకంలో భారత క్రికెట్ టీమ్‌లో కీలకంగా వ్యవహరించారు. సునీల్ గవాస్కర్‌తో కలిసి ఓపెన్ బ్యాటింగ్‌కు దిగేవారు. 1969లో తొలి మ్యాచ్‌ న్యూజిలాండ్‌తో ఆడారు. 40 టెస్టులు ఆడి 2,084 పరుగులతో 31.37 రన్‌రేటు సాధించారు. ఇందులో 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 
 
12 ఏళ్ల తన కెరీర్‌లో 7 వన్డే అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 153 పరుగులు చేశారు. సిడ్నీలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అత్యధికంగా 46 పరుగులు చేశారు. ఒక్క సెంచరీ కూడా చేయకుండా 2000 పరుగులు చేసిన తొలి ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆయనే కావడం విశేషం. 1981లో అర్జున్ అవార్డు అందుకున్నారు. రెండుసార్లు యూపీలోని అమ్రోహి నుంచి లోక్‌సభకు చేతన్ చౌహాన్ ఎన్నికయ్యారు. చేతన్ చౌహాన్ మృతిపట్ల పలువురు మాజీ క్రికెటర్లు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు