ఈ ఒప్పందం మేరకు యుద్ధ ఖైదీలకు జాతి, మత, లింగ ప్రాంత వివక్షలకు తావు ఉండదు. సైనికులు ఎవరైనా సరే మానవతా దృక్పథంతో సాయం అందించాల్సి ఉంటుంది. హింసించడం, దాడులు చేయడం చేయకూడదు. న్యాయ విచారణ, తీర్పు లేకుండా వారికి ఎలాంటి శిక్షలు విధించవద్దు. వారు గాయపడి, గాయపడకపోయినా వైద్య పరీక్షలు చేయించాలి.
ఇకపోతే, జెనీవా రెండో ఒప్పందం నౌకాదళానికి, ఇతర నేవీ దళాలకు వర్తిస్తుంది. యుద్ధంలో సైనికులు కాకుండా సామాన్య పౌరులు పట్టుబడితే ఎలా? దానిపై కూడా ఒప్పందంలో ఉంది. సైనికుల మాదిరిగానే వీరికి రక్షణలూ కల్పించాలి. వారి పరిస్థితిని బట్టి చర్యలు తీసుకోవాలని ఒప్పందంలో పేర్కొంది.
సముద్రాల్లో పట్టబడితే వారికి ఓడల్లోనే వైద్య సహాయం అందించాల్సి ఉంటుంది. వారిని కూడా క్షేమంగా చూడాలి. యుద్ధ ఖైదీలుగా పట్టుబడిన వ్యక్తి నుంచి కేవలం పేరు, వారి ర్యాంకు, నంబర్ మాత్రమే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇతరత్రా సమాచారం రాబట్టేందుకు వీలులేదు. హింసించడం, శారీరకంగా, మానసికంగా హింసలకు గురిచేయరాదని స్పష్టంగా ఒప్పందంలో పొందుపరిచింది.
మరి ఇపుడు అభినందన్ వర్ధమాన్ విషయంలోనూ జెనీవా ఒప్పందాలు మరోమారు తెరపైకి వచ్చాయి. ఈ ఒప్పందానికి లోబడి అభినందన్ను పాకిస్థాన్ విడుదల చేస్తుందా లేదా అన్నదే ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. ఒకవేళ ఒప్పందాన్ని బేఖాతర్ చేసి అభినందన్ను విడుదల చేయని పక్షంలో భారత్ ఏ విధంగా స్పందిస్తుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.