ఇంగ్లండ్‌పై టీమిండియా జయభేరి.. 3-2తో టీ-20 సిరీస్ కూడా భారత్‌దే!

శనివారం, 20 మార్చి 2021 (23:07 IST)
Team India
ఇంగ్లండ్‌తో జరిగిన ట్వంటీ-20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. సొంతగడ్డపై తన సత్తా ఏంటో నిరూపించింది. ఫలితంగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను భారత్‌ 3-2తో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన చివరిదైన ఐదో టీ20లో భారత్‌ 36 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షోతో ఆధిపత్యం ప్రదర్శించిన భారత్‌ సిరీస్‌ను ఘన విజయంతో ముగించింది.
 
తొలుత టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 2 వికెట్లకు 224 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ(64: 34 బంతుల్లో 4ఫోర్లు, 5సిక్సర్లు), విరాట్‌ కోహ్లీ (80 నాటౌట్‌: 52 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు) అద్భుత అర్ధశతకాలతో విజృంభించగా సూర్య కుమార్‌ యాదవ్ ‌(32: 17 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు), హార్దిక్‌ పాండ్య (39 నాటౌట్‌: 17 బంతుల్లో 4ఫోర్లు,2సిక్సర్లు) ధనాధన్‌ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఇంగ్లాండ్‌ బౌలర్లు ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌ను ఏ దశలోనూ కట్టడి చేయలేకపోయారు. ఫలితంగా ఇంగ్లండ్ ముంగిట భారీ లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది. 
 
ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు చేసింది. ఆ జట్టులో డేవిడ్‌ మలన్(68: 46 బంతుల్లో 98ఫోర్లు, 2సిక్సర్లు), జోస్‌ బట్లర్ ‌(52: 34 బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు) మాత్రమే అర్ధశతకాలతో రాణించారు. ఒకానొక దశలో వీరిద్దరి జోరుకు ఇంగ్లాండ్‌ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. కీలక సమయాల్లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను టీమిండియా బౌలర్లు ఔట్‌ చేసి మ్యాచ్‌పై పట్టుసాధించారు. 
 
ఆఖర్లో సాధించాల్సిన రన్‌రేట్‌ ఎక్కువగా ఉండటం, వేగంగా ఆడే క్రమంలో వికెట్లు పారేసుకుంది. బెన్‌స్టోక్స్‌(14) చెలరేగా ప్రయత్నం చేసినా నటరాజన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. జేసన్‌ రాయ్‌(0), జానీ బెయిర్‌స్టో(7), ఇయాన్‌ మోర్గాన్‌(1) విఫలమయ్యారు. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌(2/15), శార్దుల్‌ ఠాకూర్‌(3/45) గొప్పగా బౌలింగ్‌ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు